గుత్తి రైల్వే స్టేషన్ వద్ద అందుబాటులోకి బైపాస్ లైన్‌

by Disha Web Desk 16 |
గుత్తి రైల్వే స్టేషన్ వద్ద అందుబాటులోకి బైపాస్ లైన్‌
X

దిశ, డైనమిక్ బ్యూరో: దక్షిణ మధ్య రైల్వే ఇటీవలి కాలంలో ట్రాఫిక్ సౌకర్యాలను మెరుగుపరచడం ద్వారా ప్రయాణీకుల సరుకు రవాణా రైళ్లను సజావుగా, సులభంగా నిర్వహించడానికి చర్యలు చేపట్టిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రైళ్ల రాకపోకలను సులభతరం చేసేందుకు ప్రధాన జంక్షన్ల వద్ద చేపట్టిన కీలక పనుల్లో బైపాస్ లైన్ల నిర్మాణం ఒకటి. ఇందులో భాగంగా ఉమ్మడి అనంతపురం జిల్లా గుత్తి జంక్షన్‌లో 3.2 కిలోమీటర్ల మేర చేపట్టిన ఈ బైపాస్‌లైన్‌ను రూ.43 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించారు. గుత్తి- ధర్మవరం ప్రధాన రైలు మార్గంతో గుత్తి-రేణిగుంట ప్రధాన రైలు మార్గాన్ని కలుపుతూ గుత్తి జంక్షన్‌కు వెళ్లనవసరం లేకుండా ఈ లైన్ నిర్మించింది. గుత్తి జంక్షన్ నుండి బెంగళూరు, రేణిగుంట, డోన్, గుంతకల్, వాడి వైపు ప్రయాణికుల రైళ్లతో పాటు సరకు రవాణా రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. దక్షిణం వైపు నుంచి అంటే ధర్మవరం నుంచి

రేణిగుంట వైపు వెళ్లే రైళ్లు ఖచ్చితంగా గుత్తి స్టేషన్‌లో ఇంజన్ రివర్సల్ జరగాలి.. తద్వారా స్టేషన్‌లో రైలును నిలుపుదల చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సమస్యను అధిగమించేందుకు సుమారు రూ.43 కోట్ల నిధులతో గుత్తిలో బైపాస్‌ లైన్‌ నిర్మాణం పనులను చేపట్టింది.

ఈ కొత్త బైపాస్ లైన్‌ను ప్రారంభించడం వల్ల ధర్మవరం వైపు నుండి రేణిగుంట వైపు, అలాగే ఇరు వైపులా నిరంతరాయంగా ఇబ్బందులు లేని రైలు రాకపోకలు సాగించేందుకు ఇది ఎంతో సౌలభ్యంగా ఉంటుంది. సరుకు రవాణా రైళ్లు ఇప్పుడు సౌకర్యవంతంగా బైపాస్ లైన్ ద్వారా ప్రయాణించేందుకు వీలుపడుతుంది. రైళ్ల సగటు వేగం పెంచేందుకు.. రవాణా వ్యవస్థ వృద్ధితోపాటు రోలింగ్ స్టాక్ ( కోచ్‌లు, వ్యాగన్‌ల) వినియోగాన్ని మెరుగుపరుస్తుంది అని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ తెలిపారు. గుత్తిలో బైపాస్‌ లైన్‌ నిర్మాణం వల్ల రైళ్ల నిర్వహణ మెరుగుపడటంతో పాటు రాకపోకలు సులభతరం అవుతాయన్నారు. ఇది ముఖ్యంగా కడప మరియు నెల్లూరు జిల్లాల్లో ఉన్న థర్మల్ పవర్ ప్లాంట్లు, సిమెంట్ సైడింగ్‌లు, ఓడరేవుల వైపు సరుకు రవాణా రైళ్ల రాకపోకలను కూడా సులభతరం చేస్తుందని దక్షిణ మధ్య రైల్వే జీఎం అరుణ్ కుమార్ జైన్ పేర్కొన్నారు .


Next Story

Most Viewed