రఫాపై ఆగని దాడులు: ఐసీజే ఆదేశాలను పట్టించుకోని ఇజ్రాయెల్

గాజాలోని రఫా నగరంలో దాడులను వెంటనే నిలిపి వేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) ఇజ్రాయెల్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే.

Update: 2024-05-25 08:47 GMT

దిశ, నేషనల్ బ్యూరో: గాజాలోని రఫా నగరంలో దాడులను వెంటనే నిలిపి వేయాలని అంతర్జాతీయ న్యాయస్థానం(ఐసీజే) ఇజ్రాయెల్‌ను ఆదేశించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఆర్డర్స్ వచ్చిన కొద్ది గంటల్లోనే ఇజ్రాయెల్ ఐసీజే ఆదేశాలను ఏ మాత్రం పట్టించుకోకుండా రఫాపై దాడికి పాల్పడింది. రఫా సిటితో సహా గాజాలోని పలు ప్రాంతాల్లో శనివారం బాంబులతో విరుచుకుపడింది. రఫా, సెంట్రల్ సిటీ డెయిర్ అల్-బలాలో అటాక్స్ జరిగినట్టు స్థానిక మీడియా కథనాలు వెల్లడించాయి. నగరంలోని ఒక ప్రాంతంలో తొమ్మిది బాంబులు పడినట్టు తెలిపాయి. సైన్యం లక్ష్యాన్ని నెరవేర్చడానికి మరింత ముందుకు సాగుతామని ఇజ్రాయెల్ ప్రకటించింది. షబౌరా శరణార్థి శిబిరం, కువైట్ ఆస్పత్రి ఉన్న పశ్చిమ భాగం, పరిసర ప్రాంతాలకు సైనిక చొరబాటు మరింత విస్తరిస్తామని తెలిపారు. అయితే తాజా దాడిలో ఆస్తి, ప్రాణ నష్టానికి సంబంధించిన వివరాలు వెల్లడించలేదు.

ఇజ్రాయెల్ మారణహోమానికి పాల్పడిందని ఆరోపిస్తూ.. యుద్ధాన్ని ఆపాలని దక్షిణాఫ్రికా ఐసీజేను కోరింది. దీంతో 15 మంది న్యాయమూర్తుల బృందం ఈ కేసును విచారించింది. అనంతరం రఫాలో దాడులు ఆపాలని ఇజ్రాయెల్‌కు సూచించింది. అయితే ఐసీజే నిర్ణయంపై, ఇజ్రాయెల్ ఆర్థిక మంత్రి బెజలెల్ స్మోట్రిగ్ స్పందిస్తూ.. ‘ఇజ్రాయెల్ ప్రస్తుతం దాని ఉనికి కోసం పోరాడుతోంది. దాడులను ఆపాలని డిమాండ్ చేసే వారు ఇజ్రాయెల్‌ను నాశనం చేయాలనుకుంటున్నారు. మేము దానిని అంగీకరించబోము’ అని తెలిపారు. ఇజ్రాయెల్ స్వాతంత్ర్యం కోసం పోరాడుతూనే ఉంటామని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలోనే రఫాలో దాడులను తీవ్రతరం చేసినట్టు తెలుస్తోంది. కాగా, 7 నెలలుగా ఇజ్రాయెల్ హమాస్ యుద్ధం కొనసాగుతోంది. 

Tags:    

Similar News