ఉక్రెయిన్‌ పవర్ ప్లాంట్లపై రష్యా దాడి.. కరెంట్‌ పొదుపుగా వాడుకోవాలని పిలుపు

గత రెండేళ్లుగా జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ముగిసిపోయేలా కనిపించడం లేదు

Update: 2024-04-27 12:59 GMT

దిశ, నేషనల్ బ్యూరో: గత రెండేళ్లుగా జరుగుతున్న రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఇప్పట్లో ముగిసిపోయేలా కనిపించడం లేదు. శుక్రవారం అర్థరాత్రి రష్యా, ఉక్రెయిన్‌పై క్షిపణులతో విరుచుకుపడింది. ఆ దేశ మౌళిక సదుపాయాలను దెబ్బతీయడానికి రాత్రి సమయంలో నాలుగు పవర్‌ ప్లాంట్‌లపై క్షిపణులతో రష్యా దాడి చేయడంతో పరికరాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఈ విషయాన్ని ఉక్రెయిన్ అధికారులు శనివారం తెలిపారు. దీంతో విద్యుత్ ఉత్పత్తిపై తీవ్ర ప్రభావం పడింది. అధికారులు పశ్చిమాన ఉన్న ప్రధాన ఓవర్‌హెడ్ విద్యుత్ లైన్‌ను డిస్‌కనెక్ట్ చేశారు. ప్రజలు విద్యుత్‌ను పొదుపుగా వాడుకోవాలని సూచించారు.

తక్కువ విద్యుత్ కారణంగా రాత్రి 7 నుండి 10 గంటల మధ్య కెటిల్స్, ఐరన్‌లు, వాషింగ్ మెషీన్లు, మైక్రోవేవ్‌లను ఉపయోగించవద్దని పిలుపునిచ్చారు. పవర్ ప్లాంట్‌లను తిరిగి పునరుద్ధరించడానికి అధికారులు శ్రమిస్తున్నారు. ఇటీవల కాలంలో రష్యా, ఉక్రెయిన్ ఇంధన సౌకర్యాలు, మౌలిక సదుపాయాల లక్ష్యంగా దాడులు చేస్తుంది. దీంతో ఉక్రెయిన్‌లో ఇంధన సరఫరా చాలా వరకు తగ్గిపోయింది. అటు ఉక్రెయిన్ కూడా రష్యాకు చెందిన రెండు చమురు శుద్ధి కర్మాగారాలు, ఒక సైనిక వైమానిక స్థావరంపై 60 కంటే ఎక్కువ డ్రోన్‌లను ప్రయోగించినట్లు ఉక్రెయిన్ అధికారులు తెలిపారు.

Similar News