భారత్ చేరుకున్న 36 వన్ వెబ్ శాటిలైట్స్.. చారిత్రాత్మక క్షణమన్న ఎన్ఎస్ఐఎల్ చైర్మన్
భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) త్వరలోనే ప్రయోగించనున్న వన్వెబ్ 36 ఉపగ్రహాలు మంగళవారం భారతదేశానికి చేరుకున్నాయి..Latest Telugu News
న్యూఢిల్లీ: భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) త్వరలోనే ప్రయోగించనున్న వన్వెబ్ 36 ఉపగ్రహాలు మంగళవారం భారతదేశానికి చేరుకున్నాయి. ఈ ఉపగ్రహాలను శ్రీహరికోట నుంచి లాంచ్ చేయనుండగా సతీష్ ధావన్ స్పేస్ సెంటర్కు చేరాయి. యూకేకు చెందిన సంస్థ న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్(ఎన్ఎస్ఐఎల్)తో చేసుకున్న ఒప్పందంలో భాగంగా ఈ ఉపగ్రహాలను జీఎస్ఎల్వీ ఎంకే3 ప్రయోగించనుంది.
అయితే ఇస్రో ఇప్పటివరకు ప్రయోగ తేదీపై ఎలాంటి ప్రకటన ఇవ్వకపోగా, వచ్చే నెలలో లాంచ్ చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ లాంచ్తో వన్వెబ్ ప్రపంచవ్యాప్తంగా హై-స్పీడ్, తక్కువ-లేటెన్సీ కనెక్టివిటీ సేవలను భూమికి తక్కువ కక్ష్యలో 70 శాతానికి పైగా చేరుతాయని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ లాంచ్ వన్వెబ్ సంస్థకు చెందిన 14వ మిషన్ కావడం గమనార్హం.
36 వన్వెబ్ శాటిలైట్స్ను భారత్ నుంచి ప్రయోగించడం చారిత్రాత్మక క్షణమని న్యూస్పేస్ ఇండియా లిమిటెడ్ చైర్మన్ రాధాకృష్ణన్ అన్నారు. ఇటీవల పాశ్యాత్య దేశాలు, రష్యా మధ్య నెలకొన్న సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో వన్వెబ్ ప్రయోగాలు చేపట్టేందుకు రష్యా నిరాకరించింది. దీంతో కొత్త భాగస్వాముల కోసం వన్వెబ్ చూస్తుంది. వన్వెబ్ కు ఇస్రోతో మాత్రమే కాకుండా స్పేస్ ఎక్స్ తోనూ భాగస్వామ్యం కలిగి ఉంది.