జమ్మూకశ్మీర్‌లో తగ్గిన ఉగ్రవాదం

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో గడిచిన నాలుగేళ్లలో ఉగ్రవాదం రేటు..telugu latest news

Update: 2022-04-06 17:33 GMT

శ్రీనగర్ : జమ్మూకశ్మీర్‌లో గడిచిన నాలుగేళ్లలో ఉగ్రవాదం రేటు తగ్గిందని కేంద్ర హోంశాఖ బుధవారం పార్లమెంట్ లో ప్రకటించింది. ఆర్టికల్ 370, అధికరణ 35A రద్దు మంచి ఫలితాలను ఇస్తోందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి నిత్యానంద్ రాయ్ తెలిపారు. గతంలో ఆర్టికల్ రద్దు చేశాక కశ్మీర్ లో కొంత ఆందోళనకర పరిస్థితులు ఏర్పడినప్పటికీ ప్రస్తుతం అదంతా సర్దు మణిగిందన్నారు. జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాద కార్యకలాపాలకు సంబంధించిన డేటాను పార్లమెంటులో ప్రస్తావించిన నిత్యానంద్ రాయ్ తమ ప్రభుత్వ చర్యలు కశ్మీరీలకు మేలు చేశాయని చెప్పుకొచ్చారు. 2018లో జమ్మూకశ్మీర్‌లో 417 ఘటనలు జరగ్గా 2021 నాటికి అవి 229కి తగ్గాయన్నారు. ఇక ఉగ్రదాడుల్లో చనిపోయిన వారి డేటాను కూడా విడుదల చేసిన ఆయన 2019 ఆగస్టు 5 నుంచి 2021 మధ్య జరిగిన దాడుల్లో 87 మంది పౌరులు, 99 మంది భద్రతా సిబ్బంది మరణించారని చెప్పారు. ఇక 2014 నుంచి 2019 మధ్య జరిగిన దాడుల్లో 177 మంది పౌరులు, 406 మంది భద్రతా సిబ్బంది చనిపోయినట్లు కేంద్ర హోం శాఖ వెల్లడించింది.

Tags:    

Similar News