వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులు: హార్టికల్చర్ అధికారి
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: ఆధునిక - Sunanda reddy, a horticulture official, said there were revolutionary changes in agriculture
దిశ ప్రతినిధి, రంగారెడ్డి: ఆధునిక పద్ధతుల్లో వ్యవసాయాన్ని ప్రోత్సహించేందుకు రైతులకు ప్రభుత్వం వ్యవసాయ యంత్ర పరికరాలను సబ్సిడీపై సరఫరా చేస్తుందని జిల్లా హార్టికల్చర్ అధికారి సునంద రెడ్డి తెలిపారు. రంగారెడ్డి జిల్లాలో రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై అందించే పలు రకాల వ్యవసాయ యంత్ర పరికరాలను బుధవారం సునంద రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి సునంద రెడ్డి మాట్లాడుతూ.. ప్రస్తుతం వ్యవసాయంలో ఆధునిక పద్ధతుల ద్వారా సాగు చేసే విధానానికి రైతులు మొగ్గుచూపుతున్నారని చెప్పారు. ఎద్దుల వ్యవసాయాన్ని వదిలి యంత్రాల ద్వారా సాగు చేసేందుకు రైతులు ముందుకు రావడం అభినందనీయమన్నారు. యంత్రాల సహాయంతో వ్యవసాయాన్ని చేయడంలో రైతులు ముందడుగు వేస్తున్నారని తెలిపారు.
ఈ తరుణంలో రైతులను మరింత ప్రోత్సహించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం పలు రకాల వ్యవసాయ యంత్రాలను అందజేయడం జరుగుతుందన్నారు. తద్వారా మరింత తోడ్పాటును అందించేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. తక్కువ కాలంలో అధిక మొత్తంలో భూములను సాగు చేయడంతో పాటు సమయాన్ని ఆదా చేసుకోవడంలో అవగాహన పెంచుకోవాల్సిన అవసరం ఉందని రైతులకు సూచించారు. చెట్ల పాదులతో పాటు భూమిని చదును చేయడం, భూములను దునడం, కలుపు నివారణ వంటి వాటికి ఉపయోగపడే బ్రష్ కట్టర్, మినీ ట్రాక్టర్, ట్రాక్టర్ మొండ్ స్పేర్ వరకు ప్రభుత్వం సబ్సిడీపై అందజేస్తున్నారు. 50 శాతం రాయితీతో ఈ యంత్రాలను అందజేస్తున్నామని తెలిపారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో హార్టికల్చర్ ఇబ్రహీంపట్నం డివిజన్ అధికారి కనకలక్ష్మి, కందుకూరు డివిజన్ అధికారి సౌమ్య, డీలర్ తిరుమల్ రెడ్డి, పలువురు రైతులు తదితరులు పాల్గొన్నారు.