విషాదం.. పిల్లలు లేరనే మనోవేదనతో ఆత్మహత్య చేసుకున్న మహిళ
దిశ, కామారెడ్డి రూరల్: వివాహం జరిగి 30 ఏళ్లయినా ఇప్పటి వరకు సంతానం..Depressed woman commits suicide in Kamareddy
దిశ, కామారెడ్డి రూరల్: వివాహం జరిగి 30 ఏళ్లయినా ఇప్పటి వరకు సంతానం కలగడంలేదని మనోవేదనకు గురైన ఓ మహిళ చెరువులో దూకి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన కామారెడ్డిలో చోటు చేసుకుంది. దేవునిపల్లి ఎస్ఐ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం... కామారెడ్డి పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన కోపుల లావణ్య(54) అనే మహిళకు 30 ఏళ్ల క్రితం అశోక్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. అప్పటినుండి పిల్లల కోసం ప్రయత్నిస్తున్నప్పటికీ ఆమెకు సంతానం కలగలేదు. అంతేకాకుండా ఆమెకు థైరాయిడ్ తోపాటు ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఎక్కువయ్యాయని తెలిపారు. ఈ విషయంలో ఆమె తన భర్త అశోక్ తో ఎప్పుడూ బాధపడుతూ చెబుతుండేది అని పేర్కొన్నారు. అయితే గురువారం సాయంత్రం తన భర్తను మందుల కోసం మెడికల్ షాప్ కు పంపించి తను కామారెడ్డి శివారులోని సరంపల్లి ప్రాంతంలో గల పెద్ద చెరువులో పడి ఆత్మహత్యకు పాల్పడినట్లు పేర్కొన్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఆమె సోదరుడు శ్రీనివాస్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాఫ్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు.