ఏపీ నుంచి ఆ అవకాశం దక్కించుకున్న ఏకైక ఎంపీ ఇతనే
రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా ఒడిశాకు చెందిన మహిళా నేత ద్రౌపది ముర్మును బీజేపీ ప్రకటించిన సంగతి తెలిసిందే.
దిశ, ఏపీ బ్యూరో : రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థిగా ఒడిశాకు చెందిన మహిళా నేత ద్రౌపది ముర్మును బీజేపీ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గురువారం ఢిల్లీ చేరుకున్న ద్రౌపది ముర్ము శుక్రవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. అయితే రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీ చేయాలనుకునే అభ్యర్థులను రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కు కలిగిన 50 మంది ప్రతిపాదిస్తే.. మరో 50 మంది బలపరచాల్సి ఉంది. ఈ క్రమంలో ద్రౌపది ముర్ము నామినేషన్కు బీజేపీ ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అయితే ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించే వారి జాబితాలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన బీజేపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేశ్ చోటు దక్కించుకున్నారు. బీజేపీ అధిష్ఠానం ఆదేశాల మేరకు ద్రౌపది ముర్మును ఎన్డీఏ అభ్యర్థిగా ప్రతిపాదిస్తూ గురువారం సీఎం రమేశ్ ప్రతిపాదన పత్రంపై సంతకం చేశారు. రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము అభ్యర్థిత్వాన్ని ప్రతిపాదించే అవకాశం దక్కిన నేతల్లో ఏపీ నుంచి కేవలం సీఎం రమేశ్ ఒక్కరే ఉండటం గమనార్హం. ఈ సంతకాలకు సంబంధించి ఫోటోలను సీఎం రమేశ్ ట్విటర్ వేదికగా విడుదల చేశారు.