సీబీఐ ఇక పంజరంలో చిలక కాదు: కేంద్ర మంత్రి

న్యూఢిల్లీ: కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ - "CBI No More Caged Parrot": Law Minister Days After Chief Justice Remark

Update: 2022-04-03 16:34 GMT

న్యూఢిల్లీ: కేంద్ర న్యాయశాఖ మంత్రి కిరణ్ రిజిజు కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)పై కీలక వ్యాఖ్యలు చేశారు. సీబీఐ ఇక ఎప్పుడు పంజరంలో చిలక కాదని అన్నారు. భారత ఉన్నత నేర దర్యాప్తు సంస్థగా వాస్తవంగా తన కర్తవ్యాలను సమర్ధవంతంగా నిర్వహిస్తుందని చెప్పారు. ఈ విషయాన్ని ఆదివారం ఆయన 'కూ యాప్' ద్వారా పోస్ట్ చేశారు. ఒకప్పుడు ప్రభుత్వంలో కూర్చున్న వ్యక్తులు విచారణలో కొన్నిసార్లు సమస్యగా మారేవారని అన్నారు. గతంలో కొందరు అధికారులు ఎదుర్కొన్న సమస్యలను ఇకపై ఉండవని స్పష్టం చేశారు.


సీబీఐ ఇంకెప్పుడు పంజరంలో చిలక కాదు. కానీ దేశంలో అత్యున్నత నేర విచారణ సంస్థగా తన విధులను వాస్తవంగా, సమర్థవంతంగా నిర్వహిస్తుంది అని పోస్ట్ చేశారు. దీంతో పాటు ఆయన ప్రసంగం వీడియోను షేర్ చేశారు. 'వారిని(సీబీఐ) ఒకప్పుడు వినియోగించుకున్నారు. నాకు బాగా గుర్తుంది. ప్రభుత్వంలో కూర్చున వ్యక్తులు కొన్నిసార్లు విచారణలో సమస్యగా మారారు. అవినీతిలో పాలుపంచుకొని అధికారంలో ఉంటే పరిస్థితుల ఎలా ఉంటాయో నాకు తెలుసు. గతంలో మనం ఇలాంటివి చాలా విన్నాం. వాటన్నింటిని దాటుకుంటూ చాలా దూరం వచ్చాం' అని తెలిపారు.


కాగా, అంతకుముందు బొగ్గుకు సంబంధించిన కేసులో విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు సీబీఐని పంజరం లో చిలకగా అభివర్ణించింది. రెండు రోజుల క్రితం సీజేఐ ఎన్వీ రమణ కూడా సీబీఐ వంటి దర్యాప్తు సంస్థలకు స్వతంత్ర ప్రతిపత్తి సంస్థను ఏర్పాటు చేయాలని అన్న సంగతి తెలిసిందే.

Tags:    

Similar News