బీజేపీ ఫస్ట్ లిస్టులోనే ఉంటా.. రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు

బీజేపీ అభ్యర్థిగానే గోషామహల్ నుంచి పోటీ చేస్తానంటూ రాజాసింగ్ కామెంట్లు చేయడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. బీజేపీ రిలీజ్ చేసే ఫస్ట్ లిస్టులోనే తన పేరు ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు.

Update: 2023-10-11 11:34 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: బీజేపీ అభ్యర్థిగానే గోషామహల్ నుంచి పోటీ చేస్తానంటూ రాజాసింగ్ కామెంట్లు చేయడం ఆ పార్టీలో చర్చనీయాంశంగా మారింది. బీజేపీ రిలీజ్ చేసే ఫస్ట్ లిస్టులోనే తన పేరు ఉంటుందని ధీమా వ్యక్తం చేశారు. గతేడాది ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత ఇప్పటివరకూ దాన్ని హైకమాండ్ ఎత్తివేయలేదు. ఈసారి గోషామహల్‌లో బీజేపీ తరపున విక్రమ్ గౌడ్ బరిలో ఉంటారనే వార్తలు వస్తున్న టైమ్‌లో రాజాసింగ్‌పై వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఒకవేళ పార్టీ తనపై సస్పన్షన్ ఎత్తివేసి గోషామహల్ నుంచి పోటీచేసే అవకాశం ఇవ్వకపోతే ఎన్నికలకే దూరంగా ఉంటానన్నారు. పార్టీ తరఫున నిలబడే అభ్యర్థికి తన వంతు మద్దతు ఇస్తానని తెలిపారు.

పార్టీ నుంచి తనను సస్పెండ్ చేస్తూ హైకమాండ్ గతేడాది తీసుకున్న నిర్ణయాన్ని వెనక్కు తీసుకుంటుందనే నమ్మకం ఉన్నదన్నారు. పార్టీ జాతీయ, రాష్ట్ర నేతల మద్దతు తనకు పుష్కలంగా ఉన్నదని, అందువల్లనే సస్పెన్షన్‌ను ఎత్తివేసి ఫస్టు లిస్టులోనే గోషామహల్ నియోజకవర్గం నుంచి పోటీచేసే అభ్యర్థిగా తన పేరు ఉంటుందనే ధీమాను వ్యక్తం చేశారు. ఒకవేళ అవకాశం ఇవ్వకుంటే సైలెంట్‌గా ఉండిపోతాను తప్ప మరో పార్టీలో చేరడమో లేక స్వతంత్ర అభ్యర్థిగా బరిలో నిలవడమో ఉండదని తేల్చి చెప్పారు. హిందూ ధర్మం కోసం తన పని తాను చేసుకుంటానన్నారు. ఒక ప్రైవేటు టీవీ ఛానెల్‌తో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు.

Tags:    

Similar News