ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేస్తాం.. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి

వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో నాపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ భువనగిరి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మునుగోడు నియోజకవర్గ శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజాగోపాల్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Update: 2024-04-30 07:08 GMT

దిశ, చండూరు: వచ్చే పార్లమెంటు ఎన్నికల్లో నాపై నమ్మకంతో కాంగ్రెస్ పార్టీ భువనగిరి అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని మునుగోడు నియోజకవర్గ శాసనసభ్యుడు కోమటిరెడ్డి రాజాగోపాల్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కిరణ్ కుమార్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ మంగళవారం చండూరులో ఏర్పాటు చేసిన రోడ్డు షో లో ఆయన మాట్లాడారు. ఏది ఏమైనా ఆగస్టు 15 లోపు రైతు రుణమాఫీ చేసి తీరుతామని భరోసా ఇచ్చారు.

ఇప్పటికే ఆరు గ్యారంటీలల్లో చాలా వాటిని అమలుచేసామన్నారు. అధికారంలోకి వచ్చి వంద రోజులే అవుతున్న హామీలు అమలు చేయడం లేదని కేసీఆర్ అసత్య ప్రచారం చేయటం సిగ్గుచేటు అన్నారు. కాంగ్రెస్ పార్టీ గెలిస్తేనే బడుగు బలహీన వర్గాల ప్రజల కష్టాలు తీరుతాయన్నారు. సిరిసిల్లకు ధీటుగా మునుగోడు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. చండూరులో ఆగిపోయిన అభివృద్ధి పనులను పూర్తి చేస్తానని అన్నారు.

ఈ ప్రాంత అభివృద్ధి కోసం ఎంతటి త్యాగానికైనా సిద్ధమని తెలిపారు. కులం పేరుతో, మతం పేరుతో ఓట్లు అడిగే వారిపట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. బీజేపీ, బీఆర్‌ఎస్ మధ్య చీకటి ఒప్పందాలు ఉన్నాయని బీఆర్‌ఎస్‌కు ఓటు వేస్తే బీజేపీకి వేసినట్లే అని అన్నారు. తెలంగాణ రాష్ట్రాన్ని పది సంవత్సరాలు దోచుకుని అప్పులపాలు చేసి కేసీఆర్ కాలి చిప్ప అప్పజెప్పారని ఎద్దేవా చేశారు. అవినీతి ఆరోపణలతో బిడ్డ జైలుకు వెళ్లినా ఏ మొఖం పెట్టుకుని ప్రజల మధ్య తిరుగుతున్నావ్ కేసీఆర్ అని నిలదీశారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌లను ఓడించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని ప్రజలను కోరారు.

అంతకు ముందు పార్లమెంట్ అభ్యర్థి కిరణ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ నాకు ఒక అవకాశం కల్పించి గెలిపించాలని ఎమ్మెల్యే సహకారంతో ఈ ప్రాంత అభివృద్ధికి కృషిచేస్తానని,పెండింగ్ ప్రాజెక్టులు పూర్తికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో టీపీసీసీ ప్రధాన కార్యదర్శి పున్న కైలాష్ నేత, సీపీఐ జిల్లా కార్యదర్శి నేలికంటి సత్యం వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:    

Similar News