తల్లిదండ్రులను వేధించిన తనయుడు.. చివరకి తండ్రి చేతుల్లోనే..

పెళ్లి చేయాలని, ఆస్తి పంచాలని నిత్యం తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురిచేసిన కొడుకు తండ్రి చేతిలో హతమైన ఘటన గురువారం స్టేషన్ ఘనపూర్ మండలం తాటికొండలో గ్రామంలో చోటుచేసుకుంది.

Update: 2023-02-23 17:09 GMT

దిశ, జనగామ: పెళ్లి చేయాలని, ఆస్తి పంచాలని నిత్యం తల్లిదండ్రులను మానసిక క్షోభకు గురిచేసిన కొడుకు తండ్రి చేతిలో హతమైన ఘటన గురువారం స్టేషన్ ఘనపూర్ మండలం తాటికొండలో గ్రామంలో చోటుచేసుకుంది. ఏసీపీ రఘుచందర్ కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. తాటికొండకు చెందిన మారబోయిన రాజయ్య కుమారుడు నవీన్ (28), ఏం పని చేయకుండా జులాయిగా తిరుగుతూ మద్యం తాగుడుకు బానిసయ్యాడు. తనకు పెళ్లి చేయాలని, ఆస్తి పంచాలని తల్లిదండ్రులతో గొడవపడేవాడు. దీంతో తల్లిదండ్రులు విసుగు చెందారు.

కాగా గురువారం మధ్యాహ్నం తండ్రి, కొడుకులు ఇద్దరు వ్యవసాయ బావి వద్దకు వెళ్లి అక్కడే గొడవపడ్డారు. ఈ క్రమంలో తండ్రి రాజయ్య తనయుడు నవీన్ తలపై గడ్డపారతో మోదాడు. దీంతో తీవ్ర రక్తస్రావమై నవీన్ అక్కడికక్కడే మృతి చెందాడు. అనంతరం తీవ్ర భయాందోళనకు గురైన రాజయ్య ఏమి చేయాలో తెలియక పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డాడు. అనంతరం పోలీస్ స్టేషన్ కి వెళ్లి లొంగిపోయాడు.

ఈ విషయం పోలీసులకు తెలియడంతో ఘటన స్థలానికి చేరుకొని పంచానామా నిమిత్తం శవాన్ని ఏరియా ఆసుపత్రి తరలించారు. పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్న రాజయ్యను చికిత్స నిమిత్తం వరంగల్ ఎంజీఎంకు తరలించారు. స్థలాన్ని ఏసీబీ రఘుచందర్, సీఐ సంతోష్ లు సందర్శించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    

Similar News