ప్రమాదవశాత్తు బల్దియా ఉద్యోగి మృతి
ప్రమాదవశాత్తు గ్రేటర్ వరంగల్ బల్దియా ఉద్యోగి ఒకరు గురువారం మృతిచెందాడు.
దిశ, వరంగల్ టౌన్ : ప్రమాదవశాత్తు గ్రేటర్ వరంగల్ బల్దియా ఉద్యోగి ఒకరు గురువారం మృతిచెందాడు. హన్మకొండ గోపాలపురకు చెందిన ఇమ్మడి చంద్రశేఖర్ (50) బల్దియా విద్యుత్ విభాగంలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పని చేస్తున్నాడు. గురువారం సురేంద్రపురి కాలనీలో విద్యుత్ మరమ్మతుల్లో భాగంగా విద్యుత్ స్తంభం ఎక్కాడు. ప్రమాదవశాత్తు స్తంభం పైనుంచి కిందపడ్డాడు. తీవ్ర గాయాలు కావడంతో మృతిచెందాడు. విషయం తెలుసుకున్న మేయర్ గుండు సుధారాణి, కమిషనర్ షేక్ రిజ్వాన్ భాషా మృతుడి కుటుంబాన్ని పరామర్శించారు.
చంద్రశేఖర్ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. మృతుడి కుటుంబ సభ్యులకు తమ సానుభూతి వెలిబుచ్చారు. ప్రభుత్వం తరఫున కుటుంబాన్ని ఆదుకుంటామని మేయర్ సుధారాణి హామీ ఇచ్చారు. చంద్రశేఖర్ కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఔట్ సోర్సింగ్పై ఉద్యోగావకాశం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. మృతుడి అంతిమ సంస్కారాలకు రూ.10వేలు తక్షణ సాయంగా అందజేశారు. మేయర్, కమిషనర్ వెంట కార్పొరేటర్ సిరంగి సునీల్ కుమార్, బల్దియా ఇంచార్జి ఈఈ సంజయ్ కుమార్, ఏఈ సరిత ఉన్నారు.