వేధిస్తున్నాడని వ్యక్తిని హతమార్చిన యువతి
వ్యక్తి వేధిస్తున్నాడని ఓ యువతి దారుణ హత్య చేసిన ఘటన ఏటూరునాగారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది.
దిశ, ఏటూరునాగారం : వ్యక్తి వేధిస్తున్నాడని ఓ యువతి దారుణ హత్య చేసిన ఘటన ఏటూరునాగారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ఏటూరునాగారం ఎస్సై రమేష్ తెలిపిన వివరాల ప్రకారం మండల కేంద్రంలోని 3వ వార్డుకు చెందిన రామటెంకి శ్రీను(32) అనే వ్యక్తి జాడీ సంగీత(30) అనే మహిళ చిన్న తనం నుండి మిత్రులు. కాగా కొంత కాలంగా శ్రీను, సంగీతను వేధిస్తుండడంతో ఆమె స్థానిక పోలీసుస్టేషన్లో కేసు పెట్టింది. దాంతో ఒకసారి శ్రీను జైలుకు కూడా వెళ్లివచ్చాడు. జైలు నుండి వచ్చిన శ్రీను పద్ధతి మార్చుకోకుండా మరలా వేధింపులకు పాల్పడుతున్నాడు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి 9 గంటల సమయంలో సంగీత ఇంటికి వెళ్లి శ్రీను తలుపు తీయాలని బలవంతం చేశాడు.
ఎంతసేపటికి తలుపు తీయకపోయే సరికి అక్కడి నుండి వెళ్లిపోయిన శ్రీను మరలా రాత్రి ఒంటి గంట సమయంలో సంగీత ఇంటి వద్దకు వచ్చి తలుపు తీయాలని బలవంతం చేశాడు. కాసేపటికి తలుపు తీసిన సంగీత ముందుగానే రచించుకున్న పథకం ప్రకారం శ్రీను ఇంటిలోకి రాగానే అక్కడే ఉన్న దోమతెర, ఒక వైరుతో కట్టి ఇంటి ముందర ఉన్న షెడ్డు పోల్ కు కట్టేసి కత్తితో పలుమార్లు పొడిచి హత్య చేసింది. హత్య చేసిన సంగీత పోలీసుస్టేషన్కు వెళ్లి లొంగిపోయింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.