తెలంగాణలో బై పోల్.. భారీగా షాక్ ఇచ్చిన గ్రాడ్యుయేట్లు
ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్ల సంఖ్య భారీగా తగ్గింది...
దిశ, నల్లగొండ బ్యూరో: ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకునే ఓటర్ల సంఖ్య భారీగా తగ్గింది. 2021 ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టభద్రుల ఓట్లు 5,05,565 ఉండేవి. కానీ ఈనెల 27న జరగనున్న ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో 4,63,836 ఓటర్లు మాత్రమే తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. సుమారు 41,729 ఓటర్ల సంఖ్య తగ్గినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
ఓటర్ నమోదుపై తగ్గిన ప్రచారం...
2021 ఎమ్మెల్సీ ఎన్నికల సమయంలో పట్టభద్రుల ఓటు నమోదుపై పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. ఎన్నికల కమిషన్, ప్రభుత్వమే కాకుండా రాజకీయ పార్టీలు కూడా ఓటర్లను చైతన్యం చేస్తూ ఓటు నమోదును ప్రోత్సహించారు. కానీ ఈసారి మాత్రం ప్రభుత్వ అధికారులు తప్ప అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కానీ, ప్రతిపక్ష పార్టీలు కానీ పట్టభద్రుల ఓటు నమోదుపై పెద్దగా ఆసక్తి చూపలేదనేది స్పష్టంగా తెలుస్తోంది. అందుకే ఈసారి ఓటర్ల సంఖ్య భారీగా తగ్గిందని భావిస్తున్నారు.
అన్ని ఏర్పాట్లు పూర్తి..
వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్స్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు ఉమ్మడి జిల్లాల్లో ఎన్నికల ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఎన్నికలకు అవసరమైన పోలింగ్ స్టేషన్లు, సిబ్బంది, పోలీస్ బందోబస్తు ఇతర సౌకర్యాలను ఇప్పటికే పూర్తి చేసినట్లు అధికారులు పేర్కొంటున్నారు.
2021లో ఎమ్మెల్సీ ఓట్లు
జిల్లా ఓట్లు
సిద్దిపేట 3584
జనగాం 22213
వరంగల్ అర్బన్ 66379
వరంగల్ రూరల్. 33969
మహబూబాబాద్ 36633
ములుగు 10323
భూపాలపల్లి. 12796
భద్రాద్రి. 42679
ఖమ్మం. 87172
యాదాద్రి భువనగిరి 38367
సూర్యాపేట. 61624
నల్గొండ. 90826
--------------------------------------------
ఓట్లు 505565
---------------------------------------------
2024 ఎమ్మెల్సీ ఓట్లు ఇలా..
జిల్లా పు స్త్రీ ఇతరులు మొత్తం
సిద్దిపేట 3122 1557 --- 4679
జనగాం 14915 8503 1 23419
హనుమకొండ 25739 17990 1 43729
వరంగల్ 27038 16774 -- 43812
మహబూబాబాద్ 22948 11985. .... 34933
ములుగు 6587 3712 ... 10299
భూపాలపల్లి 8000 4535 .... 12535
భద్రాద్రి 22590 17516 ... 40106
ఖమ్మం 50676 33199 .... 83879
యాదాద్రి భువనగిరి 20838 13242 ..... 34080
సూర్యాపేట 34 176 17321 .... 51497
నల్లగొండ 51560 29311 ... 80871
----------------------------------------------
మొత్తం 288189 175645 02 463836
---------------------------------------------
605 పోలింగ్ స్టేషన్లు..
పట్టభద్రుల శాసనమండలి నియోజకవర్గంలోని 12 జిల్లాల్లో మొత్తం 605 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ఆయా జిల్లాల్లో ఓటర్ల సంఖ్యను బట్టి పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ పోలింగ్ కేంద్రాలన్నీ పూర్తిగా మండల కేంద్రాల్లోనే ఏర్పాటు చేశారు. పోలింగ్ ఉదయం 8 నుంచి సాయంత్రం 4 గంటల వరకు నిర్వహిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
ప్రతి పోలింగ్ స్టేషన్కు ఐదుగురు పోలీసులు..
ఎమ్మెల్సీ ఉప ఎన్నిక సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రతి పోలింగ్ స్టేషన్కు ఐదుగురు సిబ్బంది చొప్పున ఏర్పాటు చేశారు. మొత్తంగా 3025 మంది పోలీస్ సిబ్బంది ఎన్నికల విధుల్లో పాల్గొంటున్నారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఏర్పాటు చేసినట్లుగానే ఈసారి కూడా భద్రత చర్యలు తీసుకుంటున్నారు.