తెలంగాణకు కొత్త గవర్నర్.. మూడోసారి అదే సెంటిమెంట్ రిపీట్

తెలంగాణకు గవర్నర్న నియామకం విషయంలో ఓ సెంటిమెంట్ కంటిన్యూ అవుతోందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో తెరపైకి వస్తోంది.

Update: 2024-03-19 11:13 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:తెలంగాణ గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె స్థానంలో జార్ఖండ్ గవర్నర్ గా పని చేస్తున్న సీపీ రాధాకృష్ణకు రాష్ట్రపతి తెలంగాణ గవర్నర్ గా అదనపు బాధ్యతలను అప్పగించారు. పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ గా కూడా ఆయనకే అదనపు బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన ఇవాళ హైదరాబాద్ కు రానున్నారు. రేపు తెలంగాణ నూతన గవర్నర్ గా బాధ్యతలు స్వీకరించనున్నారు. అయితే తాజాగా సీపీ రాధాకృష్ణను తెలంగాణకు గవర్నర్ గా బాధ్యతలు అప్పగించడం ద్వారా రాష్ట్రం విడిపోయాక ఓ సెంటిమెంట్ కంటిన్యూ అవుతోందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో తెరపైకి వస్తోంది.

తమిళ నేతలే..:

తెలంగాణకు నియమింపబడుతున్న గవర్నర్లంతా తమిళనాడు రాష్ట్రానికి చెందిన వారు కావడం హాట్ టాపిక్ అవుతున్నది. ఉమ్మడి ఆంద్రప్రదేశ్ కు చివరి గవర్నర్ గా వ్యవహరించిన ఈ.ఎస్.ఎల్ నరసింహన్ తెలంగాణ ఏర్పాటయ్యాక కూడా ఆయన కొనసాగారు. తెలంగాణతో పాటు ఏపీకి గవర్నర్ గా బాధ్యతలు నిర్వర్తించారు. ఇంటిలిజెన్స్ బ్యూరో ప్రధాన అధికారిగా పని చేసిన ఈ.ఎస్.ఎల్. నరసింహన్ తమిళనాడుకు చెందిన వ్యక్తి కాగా ఆయన తర్వాత తెలంగాణకు గవర్నర్ గా వచ్చిన తమిళిసై సౌందర రాజన్ సైతం తమిళనాడుకు చెందిన వ్యక్తే. ఇక తమిళిసై రాజీనామాతో జార్ఖండ్ గవర్నర్ సీపీ రాధాకృష్ణకు రాష్ట్ర గవర్నర్ బాధ్యతలు అప్పగించారు. అయితే సీపీ రాధాకృష్ణ సైతం తమిళనాడుకు చెందిన వ్యక్తి కావడం విశేషం. ఇదిలా ఉంటే తమిళిసై సౌందర రాజన్, సీపీ రాధాకృష్ణన్ ఈ ఇద్దరు గతంలో తమిళనాడు బీజేపీకి రాష్ట్ర అధ్యక్షులుగా పని చేసిన వారే. దీంతో తెలంగాణ గవర్నర్ల విషయంలో తమిళ సెంటిమెంట్ తో పాటు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులుగా పని చేసిన వారినే నియమిస్తున్నారనే సెంటిమెంట్ కంటిన్యూ అవుతోందా అనే చర్చ తెరమీదకు వస్తోంది.

Tags:    

Similar News