నైతిక బాధ్యతగా సీఎం రాజీనామా చేయాలి!.. ఆర్ఎస్పీ సంచలన వ్యాఖ్యలు

శ్రీధర్ రెడ్డిది ముమ్మాటికీ రాజకీయ హత్యనే అని, దీనికి నైతిక భాద్యత వహించి హోంమంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు.

Update: 2024-05-23 09:30 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: శ్రీధర్ రెడ్డిది ముమ్మాటికీ రాజకీయ హత్యనే అని, దీనికి నైతిక భాద్యత వహించి హోంమంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. వనపర్తి జిల్లాలో బీఆర్ఎస్ నాయకుడి హత్యపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన కాంగ్రెస్ నాయకులపై నిప్పులు చెరిగారు. నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రి జూపల్లి కృష్ణారావు అండతో బీఆర్ఎస్ నాయకులపై పట్టపగలే దాడులు జరుగుతున్నాయి. వాళ్ల ప్రాణాలకు పెను ప్రమాదం పొంచి ఉందని డీజీపీకి మేము ఫిర్యాదు చేసిన పది రోజుల్లోనే వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామంలో బీఆర్ఎస్ నాయకులు, మృదు స్వభావి, శ్రీధర్ రెడ్డి గారు చాలా దారుణంగా హత్యకు గురయ్యారని తెలియజేశారు.

ఇది ముమ్మాటికి రాజకీయ హత్యనే అని, తెలంగాణలో ప్రతిపక్షమే ఉండకూడదని పక్కా ప్లాను ప్రకారమే కాంగ్రెస్ ప్రభుత్వం హత్యల సంస్కృతికి తెరలేపిందని, ఇది ప్రజా పాలన కాదు-ప్రతీకార పాలన అని మండిపడ్డారు. మంత్రి అండదండలతో యధేచ్చగా జరుగుతున్న దాడుల్లో అధికార పార్టీ నిందితులను వెంటనే అరెస్ట్ చేసి వారిని పీడీ యాక్ట్ లాంటి చట్టాలను ప్రయోగించి జైల్లో పెట్టకపోవడం వల్లనే ఇలాంటి వరుస హత్యలు జరుగుతున్నాయని అన్నారు. నిందితులతో కుమ్మక్కైతున్న కొందరు స్థానిక పోలీసు అధికారులను, ఎంతటి వారైనా సరే, వారిపై డిపార్ట్మెంటల్ ఎంక్వైరీ చేసి తప్పకుండా శిక్షించాలి. బదిలీ చేయాలి అని పేర్కొన్నారు. మంత్రి జూపల్లి కృష్ణారావును మంత్రి వర్గం నుండి వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు.

అలాగే కొల్లాపూర్, నాగర్ కర్నూల్, అచ్చంపేట నియోజవర్గాల్లోని సమస్యాత్మక గ్రామాల్లో వెంటనే కేంద్ర బలగాలు/స్పెషల్ పోలీసు బలగాలతో పికెట్లను ఏర్పాటు చేయాలని, ప్రాణాలకు ముప్పున్న బీఆర్ఎస్, ఇతర ప్రతిపక్ష పార్టీల ప్రజాప్రతినిధులకు వెంటనే రక్షణ కల్పించాలని కోరారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో అడుగంటిన శాంతిభద్రతలకు నైతిక బాధ్యత వహిస్తూ.. ముఖ్యమంత్రి- హోంమంత్రి రేవంత్ రెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ గూండాలారా, మీ వరుస దాడులకు బెదరం అదరం. మీ మాఫియాలను రాజ్యాంగబద్ధంగా కుప్పకూల్చే దాకా నిద్రపోం ఖబర్దార్! అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హెచ్చరించారు.

Similar News