బండి అరెస్టుపై తరుణ్ చుగ్ సీరియస్

బండి సంజయ్ అరెస్టుపై రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

Update: 2023-04-05 07:58 GMT

దిశ, తెలంగాణ బ్యూరో : బండి సంజయ్ అరెస్టుపై రాష్ట్ర బీజేపీ వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయనను అరెస్టు చేయడానికి నిర్దిష్ట కారణాలను చూపడంలోనూ పోలీసులు విఫలమయ్యారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అధికారాన్ని పోలీసులు దుర్వినియోగం చేస్తున్నారని అన్నారు. బండి సంజయ్ తన అత్త (భార్యకు తల్లి) చనిపోయిన తర్వాత జరిగే పదవ రోజు కార్యక్రమం కోసం కరీంనగర్ నివాసానికి చేరుకుంటే అర్ధరాత్రి సమయంలో పోలీసులు అరెస్టు చేసి తీరు ఆక్షేపణీయమన్నారు.

పార్టీ జాతీయ నాయకత్వం ఈ వ్యవహారాన్ని సీరియస్‌గా తీసుకున్నదని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ దీనికి తగిన మూల్యాన్ని చెల్లించుకోక తప్పదన్నారు. ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ప్రజలు రానున్న రోజుల్లో ఇంటికి సాగనంపుతారని వ్యాఖ్యానించారు. పదో తరగతి ప్రశ్నాపత్రాలు, టీఎస్పీఎస్సీ పేపర్ల లీకేజీ వ్యవహారంతో ప్రభుత్వం ప్రజల్లో బదనాం అయిందని, దీన్ని జీర్ణించుకోలేక బండి సంజయ్‌ను కొన్ని సాకులతో అరెస్టు చేయడం హేయమైన చర్య అని వ్యాఖ్యానించారు. ప్రభుత్వ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోడానికి, ప్రజల దృష్టి నుంచి మళ్ళించడానికి ఇలాంటి చర్యలకు దిగుతున్నదని ఆరోపించారు.

Tags:    

Similar News