జగన్ వ్యాఖ్యలకు సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్

ఏపీ సీఎం జగన్ కు రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ కౌంటర్

Update: 2024-05-09 09:15 GMT

దిశ, డైనమిక్ బ్యూరో:తన చెల్లి షర్మిలను రేవంత్ రెడ్డి ద్వారా చంద్రబాబే నడిపిస్తున్నారని ఏపీ సీఎం, వైసీపీ చీఫ్ జగన్ మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీఎం రేవంత్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. షర్మిల తమ పార్టీ సభ్యురాలని తమకు పొరుగున ఉన్న రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ఆమె అధ్యక్షురాలన్నారు. అందువల్ల ఆమెకు ఎంత వరకు అవసరమో అంత వరకు తాను కచ్చితంగా మద్దతు ఇస్తానని ఇందులో తప్పేముందన్నారు. గురువారం ఎన్డీటీవీతో మాట్లాడిన రేవంత్ రెడ్డి.. జగన్ కు, షర్మిలకు మధ్య ఏదైనా కుటుంబ తగాదాలు ఉంటే అది వారి వ్యక్తిగతమని జగన్ కోసం కాంగ్రెస్ పోటీ నుంచి తప్పకోవాలా? అని ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ పరంగా షర్మిలకు ఎంత వరకు అవసరమైతే అంత వరకు తప్పకుండా మద్దతుగా ఉంటానని అవకాశం లభిస్తే ఏపీలో మరోసారి ప్రచారానికి వెళ్తానన్నారు.

కేటీఆర్ పార్ట్ టైమ్ పొలిటిషియన్:

ఎన్నికల తర్వాత రేవంత్ రెడ్డి బీజేపీతో కలిసి పోతారన్న కేటీఆర్ వ్యాఖ్యలకు రేవంత్ రెడ్డి ఘాటుగా రియాక్ట్ అయ్యారు. కేటీఆర్ పార్ట్ టైమ్ పొలిటీషియన్ అని అతడి వ్యాఖ్యలను తాము కానీ తెలంగాణ ప్రజలు కానీ సీరియస్ గా తీసుకోవడం లేదన్నారు. తండ్రిపేరుతో మంత్రి అయిన కేటీఆర్ విరామం దొరికినప్పుడల్లా వచ్చి ప్రెస్ మీట్ పెడుతారని ఆరోపించారు. లోక్ సభ ఎన్నికల్లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ గెలవబోయే సీట్ల సంఖ్యపై ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. మా టార్గెట్ 14 సీట్లు అని ఈసారి డెఫినెట్ గా డబుల్ డిజిట్ సీట్లు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ కోసం తనతో పాటు తన మంత్రులు పార్టీ శ్రేణులు క్షేత్రస్థాయిలో పని చేస్తున్నారని చెప్పారు.

అమిత్ షా ఫేక్ వీడియో కేసుపై స్పందిస్తూ.. ఈ కేసును న్యాయపరంగా ఎదుర్కొంటామని భయపెట్టాలని చూస్తే ఇక్కడ భయపడేవారెవరూ లేరన్నారు. 10 ఏళ్లు ఇక్కడ కేసీఆర్ భయపెట్టాలని చూశారని ధ్వజమెత్తారు. ఫేక్ వీడియోలు తీసుకోవాల్సిన అవసరం తనకు లేదన్నారు. ఈ సారి ఎన్నికల్లో 400 సీట్లు వస్తే బీజేపీ, నరేంద్ర మోడీ రాజ్యాంగాన్ని మార్చుతారని తాను నేరుగా ఆరోపణలు చేస్తున్నానని, ఎస్సీ, ఎస్టీ, బీసీల రిజర్వేషన్లను ఖతం చేయాలని వారు చూస్తున్నారన్నారు. ఇందుకు సంబంధించిన ఆధారాలను తాను చూపిస్తే బీజేపీ స్పందించడం లేదన్నారు.

Tags:    

Similar News