ఆస్ట్రేలియాలో షాద్నగర్లో వాసి అనుమానాస్పద మృతి
రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణానికి చెందిన అరటి అరవింద్ యాదవ్ (30) ఆస్ట్రేలియాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు.
దిశ,షాద్ నగర్ : రంగారెడ్డి జిల్లా షాద్నగర్ పట్టణానికి చెందిన అరటి అరవింద్ యాదవ్ (30) ఆస్ట్రేలియాలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. అతను ఉద్యోగరీత్యా సిడ్నీలో స్థిరపడ్డాడు. ఐదు రోజుల క్రితం అతను ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాకపోవడంతో అతని భార్య ఫిర్యాదు మేరకు అక్కడి పోలీసులు మిస్సింగ్ కేసు మొదట నమోదు చేశారు. ఆ తర్వాత అరవింద్ ప్రయాణించిన కారు సముద్రానికి కొంత దూరంలో లభించింది.
సముద్రంలో ఓ యువకుడి శవం లభ్యమైనట్టు అక్కడి స్థానిక పోలీసులు కనుగొన్నారు. ఆ శవానికి డిఎన్ఏ పరీక్షలు నిర్వహించగా ఆ డెడ్ బాడీ అరవిందేనని వైద్యులు ధ్రువీకరించారు. కారు వాష్ చేయించుకుని వస్తానని చెప్పిన వ్యక్తి సముద్రంలో శవమై కనిపించడతో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతుని బంధువులు మాట్లాడుతూ.. అరవింద్ సోమవారం ఇండియాకు వచ్చేందుకు కుటుంబ సభ్యులతో ఏర్పాట్లు చేసుకున్నారని ఇంతలోనో ఈ ఘటన జరగడం బాధాకరమని అన్నారు.