హార్డ్ వేర్ పార్కు కంపెనీలో అగ్ని ప్రమాదం
హార్డ్ వేర్ పార్క్లోని శ్రీనాథ్ వోవెన్ ప్యాక్ లిమిటెడ్ కంపెనీలో శుక్రవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో రూ.5 కోట్ల 53 లక్షల ఆస్తినష్టం సంభవించిందని యజమాని శనివారం రాత్రి పహాడిషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
దిశ, బడంగ్ పేట్ : హార్డ్ వేర్ పార్క్లోని శ్రీనాథ్ వోవెన్ ప్యాక్ లిమిటెడ్ కంపెనీలో శుక్రవారం రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో రూ.5 కోట్ల 53 లక్షల ఆస్తినష్టం సంభవించిందని యజమాని శనివారం రాత్రి పహాడిషరీఫ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పహాడిషరీఫ్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం .... శంషాబాద్ కు చెందిన పిరిడి రాజు (51) కు చెందిన మహేశ్వరం మండల పరిధిలోని రావిరాల గ్రామంలో శ్రీనాథ్ వోవెన్ ప్యాక్ లిమిటెడ్ కంపెనీలో ఈనెల 24వ తేదీన రాత్రి 8.25 గంటలకు అకస్మాత్తుగా అగ్ని ప్రమాదం సంభవించింది. అందులో ప్రధానంగా ప్లాస్టిగ్ బ్యాగ్ లు తయారు అవుతుండడంతో మంటలు పెద్ద ఎత్తున విస్తరించాయి. ఆ సమయంలో అందులో చిక్కుకున్న 15 నుంచి 20మంది కార్మికులు
సెక్యూరిటీ సహాయం తో ప్రాణాలతో సురక్షితంగా బయటపడ్డారు. సమాచారం అందుకున్న పహాడిషరీఫ్ పోలీసులు వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. 6 ఫైర్ ఇంజన్ల ద్వారా శనివారం తెల్లవారు జామున 3 గంటల వరకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. అప్పటికే అందులోని మొక్కలు, యంత్రాలు, కంప్రెషర్లు, 16 స్టిచింగ్ మిషన్లు, వెల్డింగ్ మిషన్, ఇతర సామగ్రితో పాటు షెడ్డు పూర్తిగా అగ్నికి ఆహుతైంది. దీంతో బాధితుడు రాజు రూ.5 కోట్ల 53 లక్షల విలువైన సామగ్రి అగ్నికి ఆహుతయ్యాయని పహాడిషరీఫ్ పోలీసులకు శనివారం రాత్రి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇంతకు అగ్ని ప్రమాదం ఎలా సంభవించిందన్న విషయం తేలాల్సి ఉంది. ఈ కేసును పహాడిషరీఫ్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.