ఎంపీ ఎన్నికల్లో ఆయన కోసం ప్రచారం చేస్తా: MLA రాజాసింగ్

ఈ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కోసం ప్రచారం నిర్వహిస్తానని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు.

Update: 2024-02-08 16:05 GMT

దిశ, తెలంగాణ బ్యూరో: ఈ లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్ కోసం ప్రచారం నిర్వహిస్తానని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ స్పష్టం చేశారు. అసెంబ్లీ ఆవరణలో గురువారం ఆయన మీడియాతో చిట్ చాట్ నిర్వహించారు. కాగా ప్రచారం చేయాలని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పిలిచినా సికింద్రాబాద్‌లో ప్రచారం చేస్తానని ఆయన వెల్లడించారు. ఇదిలా ఉండగా తనను జహీరాబాద్ ఎంపీగా పోటీ చేయాలని పార్టీ చెప్పిందని వివరించారు. తనకు ఎంపీగా పోటీ చేసే ఆసక్తి లేదని రాజాసింగ్ వెల్లడించారు. హిందూ రాజ్య స్థాపన కోసం దేశవ్యాప్తంగా పని చేయాలనుకుంటున్నానని పేర్కొన్నారు. శాసనసభ పక్షనేత పదవిపై కూడా తనకు ఆసక్తి లేదని, ఎవరో ఒకరిని ఫ్లోర్ లీడర్‌గా త్వరగా ఎంపిక చేస్తే బాగుంటుందని ఆయన అభిప్రాయం వ్యక్తంచేశారు. ఫ్లోర్ లీడర్ ప్రకటన ఆలస్యం మంచిది కాదని తెలిపారు. బీసీ సీఎం నినాదంతో అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లామని, అందుకే బీసీ ఎమ్మెల్యేను ఫ్లోర్ లీడర్‌గా నియమించాలని జాతీయ నాయకత్వం భావిస్తోందని రాజాసింగ్ వెల్లడించారు.

ఇదిలా ఉండగా సిర్పూర్ ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు సైతం అసెంబ్లీ ఆవరణలో మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో అనేక సమస్యలున్నప్పటకీ కేఆర్ఎంబీనే ఎందుకు ప్రస్తావిస్తున్నారని ఆయన ప్రశ్నించారు. పార్లమెంట్ ఎన్నికల్లో మోడీ ప్రభంజనం స్పష్టంగా కనిపిస్తోందని, అయితే మోడీ వేవ్‌ను సైడ్ ట్రాక్ చేసేందుకే రెండు పార్టీలు చూస్తున్నాయని ఆగ్రహం వ్యక్తంచేశారు. అసెంబ్లీలో కాంగ్రెస్, బీఆర్ఎస్‌ను ఎండగడతామని పాల్వాయి హరీష్ హెచ్చరించారు.

Tags:    

Similar News