రిజర్వేషన్లు సంక్షేమ పథకాలేనా..? రిటైర్డ్ ప్రొఫెసర్ చెన్న బసవయ్య కీలక వ్యాఖ్యలు
రిజ్వేషన్లు కేవలం సంక్షేమ పథకాలేనా? అసలు వాటిపై రాజ్యాంగం దృక్పథం ఏంటో సమాజం మొత్తం తెలుసుకోవాలని ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్ చెన్న బసవయ్య
దిశ, తెలంలగాణ బ్యూరో: రిజ్వేషన్లు కేవలం సంక్షేమ పథకాలేనా? అసలు వాటిపై రాజ్యాంగం దృక్పథం ఏంటో సమాజం మొత్తం తెలుసుకోవాలని ఓయూ రిటైర్డ్ ప్రొఫెసర్ చెన్న బసవయ్య అన్నారు. అంబేద్కర్ వర్సిటీలో ఫ్యాకల్టీ ఆఫ్ సోషల్ సైన్సెస్ ఆధ్వర్యంలో సార్వత్రిక సామాజిక వేదిక ఆధ్వర్యంలో 'రిజర్వేషన్లు, రాజ్యాంగ వైరుధ్యాలు' అనే అంశంపై బుధవారం సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ రాజ్యాంగ తత్వాన్ని అర్థం చేసుకోవాలన్నారు. రాజ్యాంగ ప్రవేశికలోని ప్రజాస్వామ్యం, న్యాయం, సాంఘిక, ఆర్థిక, రాజకీయ అంశాల సారాన్ని అవగతం చేసుకోవాలన్నారు.
అప్పుడే రిజర్వేషన్ల తాత్వికత, వాటి పునాది అర్థమవుతుందన్నారు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఈడబ్ల్యూఎస్ కోటా కింద తెచ్చిన 10 శాతం రిజర్వేషన్లు రాజ్యాంగ తత్వానికి విరుద్ధమని గతంలో రిజర్వేషన్లపై వచ్చిన తీర్పులను బట్టి స్పష్టమవుతోందన్నారు. అనంతరం సామాజిక శాస్త్రాల విభాగ డీన్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి మాట్లాడుతూ.. ఇటీవల వెల్లడైన యూపీఎస్సీ, నీట్ లాంటి ఫలితాల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీల కంటే ఈడబ్ల్యూఎస్ కోటా లో వచ్చిన వారికి తక్కువ మార్కులు రావడం అందరినీ ఆశ్చర్యం కలిగించిందన్నారు. ఈ కార్యక్రమంలో పలు విభాగాల అధిపతులు, అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది, పరిశోధక విద్యార్థులు పాల్గొన్నారు.