నిర్భయంగా ఓటు హక్కును వినియోగించుకోవాలి : జిల్లా ఎస్పీ

పట్టభద్రుల ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అన్ని రకాల భద్రతా చర్యలను పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ చందన దీప్తి తెలిపారు.

Update: 2024-05-26 14:02 GMT

దిశ,నల్గొండ: పట్టభద్రుల ఉప ఎన్నికల పోలింగ్ ప్రక్రియకు సంబంధించి జిల్లా వ్యాప్తంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా అన్ని రకాల భద్రతా చర్యలను పూర్తి చేసినట్లు జిల్లా ఎస్పీ చందన దీప్తి తెలిపారు. ఎమ్మెల్సీ ఉప ఎన్నికలకు జిల్లా వ్యాప్తంగా సజావుగా, శాంతియుతంగా ఎన్నికలు నిర్వహించుటకు జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో ఒక అడిషనల్ ఎస్పీ, 5 గురు డీఎస్పీలు, 22 మంది సీఐలు, 64 మంది ఎస్.ఐల తో కలిపి మొత్తం 1100 మంది సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టినట్లు తెలిపారు. రేపు ఉదయం 8 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జిల్లాలోని 97 పోలింగ్ కేంద్రాలలో జరగబోయే ఓటింగ్లో పట్టభద్రుల నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.

పోలింగ్ కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు,ఇతర ఎలక్ట్రానిక్ వస్తువులు,మంటను ప్రేరేపించే వస్తువులకు అనుమతి లేదని, ప్రజలంతా ఈ విషయాన్ని గమనించాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన్ ను ఖచ్చితంగా అమలయ్యే విధంగా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలియజేశారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే విధంగా ప్రవర్తించే వ్యక్తులపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలింగ్ కేంద్రాల్లో గానీ, పరిసర ప్రాంతాల్లో గానీ ఓటర్లను ప్రలోభ పెట్టే వారిపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.

ఓటర్లను ప్రలోభ పెట్టే విధంగా ఎవరైనా నగదు, మద్యం ఇతరత్రా వస్తువులను ఎవరైనా పంపిణీ చేస్తున్నట్లు తెలిస్తే వెంటనే డయల్ 100 కి ఫోన్ చేసి గానీ, సీ-విజిల్ యాప్ ద్వారా గానీ ఫిర్యాదు చేసి సమాచారం అందజేయాలని కోరారు. పోలింగ్ కేంద్రాల నుంచి 100 మీటర్ల దూరంలో ఎవరూ ఉండరాదని,ఎన్నికల నియమావళి ప్రకారం పోలీసులు చేపట్టే చర్యలను అతిక్రమిస్తే వారిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కావున పోలింగ్ ప్రక్రియకు ప్రతి ఒక్కరూ పోలీసు వారికి సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

Similar News