యావత్ తెలంగాణ రైతాంగానికి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలి: Palla Rajeshwar Reddy

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు.

Update: 2023-07-15 09:13 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి తెలంగాణ రైతాంగానికి క్షమాపణ చెప్పాలని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అమెరికాలో చంద్రబాబు అభిమానుల సమావేశంలో చంద్రబాబు శిష్యుడు అయిన పీసీసీ అధ్యక్షుడు తెలంగాణలో ఉచిత కరెంటు విషయంలో తెలివి తక్కువతనంతో మూడు గంటలు చాలు అని అసలు రూపం బయటపెట్టాడని అన్నారు. రైతులకు మూడు గంటల ఉచిత విద్యుత్ చాలన్న రేవంత్ వ్యాఖ్యలను అద్దంకి దయాకర్, పార్టీ అధికార ప్రతినిధి సుజాత మద్దతు తెలపడం కాంగ్రెస్ పార్టీ విధానాలకు నిదర్శనమని ధ్వజమెత్తారు. రేవంత్ వ్యాఖ్యలను ప్రశ్నిస్తే దురుసుగా, అగౌరవంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

కరెంట్ కొనుగోలు విషయం పారదర్శకంగా ఉంటే దాని మీద బురదజల్లడం రేవంత్ అవివేకానికి నిదర్శనమని విమర్శలు గుప్పించారు. కరెంట్ ఉద్యమంపై సీఎం కేసీఆర్ మీద నిందలు వేయడం దుర్మార్గమని సీరియస్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వ చర్యల మూలంగానే వ్యవసాయరంగంలో తెలంగాణ ముందున్నదని అన్నారు. రైతులకు మూడు గంటల కరెంట్ చాలు అన్నా కాంగ్రెస్ పార్టీ పద్దతి మీద చర్చ జరగాలని డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన 2601 రైతువేదికలలో కాంగ్రెస్ కరెంట్ విధానంపై రైతులతో చర్చ చేస్తామని తెలిపారు. దేశంలో ఏ రాష్ట్రంలోనూ 24 గంటల కరెంట్ వ్యవసాయానికి ఉచితంగా ఇవ్వడం లేదని నొక్కిచెప్పారు.

Tags:    

Similar News