రేవంత్ రెడ్డి మోసపూరిత హామీలతో గద్దెనెక్కాడు : ఈటల

రాష్ట్ర ప్రభుత్వ వద్ద అప్పులే కానీ, పథకాల అమలు కోసం నిధులు

Update: 2024-04-30 16:53 GMT

దిశ, మేడ్చల్ బ్యూరో : రాష్ట్ర ప్రభుత్వ వద్ద అప్పులే కానీ, పథకాల అమలు కోసం నిధులు లేవని మల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మంగళవారం నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో నిర్వహించిన పలు కార్యక్రమంలో ఈటల పాల్గొన్నారు. ఈటలకు ఓటర్లు బ్రహ్మరథం పడుతున్నారు. ఓల్డ్ బోయిన్ పల్లి, రైతు సమ్మేళనంలో పాల్గొన్న ఈటల రాజేందర్ మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు ఎన్నో బూటకపు హామీలు ఇచ్చింది. ఇచ్చిన హామీలు నెరవేర్చనందున..చదువుకున్నవారు కానీ, వ్యాపారస్తులు కానీ వారిని నమ్మి ఓట్లు వేయరని వారికి అర్థమైందన్నారు.దీంతో పేదవారిని ప్రలోభ పెట్టడంతోపాటు, రైతులకు రుణ మాఫీలు చేస్తామని అబద్దపు హామీలతో రైతులను మరోసారి మోసం చేసే ప్రయత్నాలు చేస్తున్నారని మండిపడ్డారు.

ఇప్పుడు రేవంత్ రెడ్డి మాట్లాడే మాటలకు విలువ లేకుండా పోయిందని ద్వజమేత్తారు. గత పదేళ్ల మోదీ పాలనలో ప్రశాంతంగా ఉన్నామని, మరోసారి ఆయనకే ఓట్లు వేసి గెలిపించాలని ప్రజలు ఆలోచిస్తున్నారని, ఇప్పుడు ఏ ఇంటికి పోయినా బీజేపీ కార్యకర్తలకు మిక్కిలి మర్యాదలు లభిస్తున్నాయని, పదేళ్ల క్రితం బీజేపీ తెలంగాణలో గెలుస్తుందని ప్రజలు నమ్మలేదని, కానీ ఇప్పుడు మోదీ పాలనపై అందరికీ విశ్వాసం ఏర్పడిందన్నారు.బీఆర్‌ఎస్ పార్టీకి ప్రజలు అసెంబ్లీ ఎన్నికలలోనే వ్యతిరేకంగా ఉన్నారు. అందుకే ఈ పార్టీకి ఓట్లు వచ్చే ప్రశ్నే లేదని ఈటల స్పష్టంచేశారు.ఇక పోతే రేవంత్ రెడ్డి మహిళలకు ఎన్నో పథకాలు ప్రకటించారు. పెళ్లిళ్లకు కళ్యాణలక్ష్మి పథకం కింద లక్ష రూపాయల నగదు, తులం బంగారం ఇస్తానని మభ్యపెట్టాడు. మహిళలకు 2,500 రూపాయల పెన్షన్, వృద్ధులకు కూడా కొత్త పెన్షన్లు ఇవ్వడం లేదు. అసెంబ్లీ ఎన్నికల అనంతరం ప్రమాణ స్వీకారం చేయగానే పథకాలు అమలు చేస్తానని చెప్పాడు. కానీ ఇంకా ఏమీ నెరవేర్చలేదని మండిపడ్డారు.మద్యం షాపుల వల్ల వచ్చే ఆదాయం తప్ప తెలంగాణకు ఆదాయం వచ్చే మార్గమే లేదన్నారు. పైగా రాహుల్ గాంధీ ప్రధాని అయితే హామీలన్నీ నెరవేర్చగలమని రేవంత్ రెడ్డి చెప్తుకోవడం శోచనీయమన్నారు. కేవలం 40 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి ఎలా వస్తుందో రేవంత్: రెడ్డి చెప్పాలని ఈటల డిమాండ్ చేశారు.. పేదలకు ఇళ్లు కట్టించే బాధ్యతను కేంద్రప్రభుత్వమే నేరుగా తీసుకుంటుందన్నారు. 

గౌడ ఆత్మీయ సమ్మేళనంలో...ఈటల మాట్లాడుతూ.. దక్షిణాది రాష్ట్రాలలోనే రాజకీయ నాయకులు ఒక ఎంపీ పదవి ఖర్చు పెట్టే డబ్బుతో ఉత్తరాదిలో రాష్ట్రానికి ఎన్నికలు జరిగిపోతాయని వారంటున్నారు. కానీ ప్రధాని మోదీ పేదింటి నుండి వచ్చారు కాబట్టి, ఆయనకు వారి కష్టాలు తెలుసు. ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టాలని ఆయన కంకణం కట్టుకున్నారని తెలిపారు.అందుకే ఆయన మొదటి సారి ఎమ్మెల్యే కాగానే ముఖ్యమంత్రిగా, మొదటి సారి ఎంపీ కాగానే ప్రధానిగా ఎన్నికయ్యారని తెలిపారు. ఇప్పుడు మూడవసారి కూడా ఆయననే ప్రధానిగా కోరుకుంటున్నారు.అతివేగంగా ఆర్థికంగా దేశాన్ని అభివృద్ధి చెందేలా ప్రధాని మోదీ కృషి చేస్తున్నారు.నిజాయితీతో, ధర్మంగా రాజకీయాలు నడుపుతున్నారు ప్రధాని మోదీ. ఇతర దేశాలలో భారత స్థాయిని అమాంతం పెంచేశారు.ఏ ఇంటికి వెళ్లినా ఈటల రాజేందర్‌కు ఎందుకు ఓటు వేయాలనే ప్రశ్నే ఉండదన్నారు.. ఎందుకంటే వారి కాళ్లకు ముల్లు దిగితే పన్నుతో పీకే సర్వీస్ చేశానని వారికి తెలుసన్నారు.

ప్రపంచంలో తెలుగు మాట్లాడే వారందరికి నేను తెలుసని అనుకుంటున్నాను. ఏ కులాల వారైనా, ఏ వర్గాల వారైనా బీజేపీకి, రాజేందర్ అన్నకు ఓటు వేయడానికి సిద్దంగా ఉన్నారు. నిజాయితీగా గెలిచే కెపాసిటీ లేనివారు కుట్రలు చేయవచ్చు. ఈ కుట్రలను చేధించే శక్తి మీకుంటుంది. నాకుండదు. మీరు డ్రైవింగ్ ఫోర్సుగా పనిచేసి, కుట్రలు చేసేవారిని కనిపెట్టి, లోపాలు అధిగమించుకుంటూ బీజేపీ పార్టీ గెలుపు కోసం కృషి చేస్తారని నమ్ముతున్నాను.సత్యం, ధర్మం తాత్కాలికంగా ఒడిదుడుకులకు గురైనా, అంతిమంగా గెలుస్తుందని నమ్మే వ్యక్తిని నేను అనిమల్కాజిగిరి పార్లమెంట్ లో గొప్ప మెజార్టీతో గెలిపిస్తారని, ఈ నియోజకవర్గానికి సేవ చేసే అవకాశం కల్పిస్తారని నమ్ముతున్నానని ఈటల అన్నారు

మెట్రోలో ఈటల ప్రయాణం..

ఎన్నికల ప్రచారంతో నిత్యం బిజీగా గడుపుతున్న ఈటల రాజేందర్ మంగళవారం సాయంత్రం మెట్రో రైలులో ప్రయాణించారు. ఎల్ బీ నగర్ నుంచి కూకట్ పల్లి హౌసింగ్ బోర్డు వరకు వెళ్లాలంటే ట్రాఫిక్ లో కనీసం రెండు గంటలు సమయం పడుతోంది.దీంతో ఎల్ బీ నగర్ నుంచి కూకట్ పల్లి వై జక్షన్ వరకు మెట్రోలో ప్రయాణం చేసి, ట్రాఫిక్ సమస్యను అధిగమించారు.. అనంతరం కూకట్ పల్లి హౌసింగ్ బోర్డులో రాత్రి నిర్వహించిన రోడ్ షోలో పాల్గొని ఎన్నికల ప్రచారం నిర్వహించారు. మెట్రోలో ప్రయాణీకులు ఈటలతో సెల్ఫీలు దిగేందుకు పోటీ పడ్డారు. వచ్చే ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తారని పలువురు ఈటలకు ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేశారు.






Similar News