కేసీఆర్ దోపిడీ వల్ల బీఆర్ఎస్‌ను బంగళాఖాతంలో కలిపారు : సీఎం రేవంత్ రెడ్డి

మోదీ, కేడీలు కలిసి నిత్యావసర ధరలు అమాంతం పెంచేశారని

Update: 2024-05-01 16:29 GMT

దిశ, మేడ్చల్ బ్యూరో/కూకట్ పల్లి :  మోదీ, కేడీలు కలిసి నిత్యావసర ధరలు అమాంతం పెంచేశారని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణకు మోదీ ఇచ్చింది గాడిద గుడ్డు అని విమర్శించారు. ప్రధాని నరేంద్ర మోదీ, మాజీ సీఎం కేసీఆర్ లు కలిసి సిలిండర్ రూ.12 వందలు చేశారని అన్నారు.మల్కాజిగిరి లోక్ సభ కాంగ్రెస్ అభ్యర్థి పట్నం మహేందర్ రెడ్డికి మద్దతుగా బుధవారం రాత్రి కూకట్ పల్లిలో రేవంత్ రెడ్డి కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ..నరేంద్ర మోదీ, కేసీఆర్ లపై నిప్పులు చెరిగారు. కేసీఆర్ చేసిన దోపిడిని చూసి తెలంగాణ ప్రజలు బీఆర్ఎస్ ను బంగాళాఖాతంలో కలిపారని తెలిపారు. తన ఇంటి తలుపులు పగలగొట్టి అర్ధరాత్రి పూట అరెస్టు చేశారని చెప్పారు. కేసీఆర్ ను ఓడించి కాంగ్రెస్ కు పట్టం కట్టిన ప్రజలకు న్యాయం చేయాల్సిన బాధ్యత తనపై ఉందన్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో సీమాంధ్ర సెటిలర్లను బేదిరించి బీఆర్ఎస్ ఓటేసుకుందని ఆరోపించారు.ఎవ్వరూ ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదన్నారు. బస్తీలలో ఉండే 26 కులాల సమస్యలను పరిష్కరించేందుకు కృషి చేస్తామని చెప్పారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి పేదవాడికి ఇంటికి రూ.500 లకే గ్యాస్ ఇస్తున్నట్లు రేవంత్ రెడ్డి అన్నారు. మోదీ కేడీ కలిసి సిలిండర్ రూ.1200 లకు పెంచేశారని ఆందోళన వ్యక్తంచేశారు.మహిళలకు ఫ్రీ బస్సు ఏర్పాటు చేశామని, ఆరోగ్య శ్రీ కింద రూ.10 లక్షలు ఇస్తున్నట్లు తెలిపారు. అర్హులైన ప్రతి లబ్ధిదారులకు 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్ ఇస్తున్నామని తెలిపారు. అధికారంలోకి వచ్చిన కొద్ది రోజుల్లోనే వేల ఉద్యోగాలు ఇచ్చినట్లు చెప్పారు. పట్నం సునీతను ఎంపీగా గెలిపిస్తే మల్కాజ్ గిరి మరింత అభివృద్ధి చెందుతుందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో మల్కాజిగిరి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి,జిల్లా ప్రెసిడెంట్ హరి వర్ధన్ రెడ్డి, కాంగ్రెస్ నేతలు బండి రమేష్, సత్యం శ్రీరంగం తదితరులు పాల్గొన్నారు.

Similar News