కంటోన్మెంట్లో 50 నామినేషన్లు దాఖలు
సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి గురువారం
దిశ, కంటోన్మెంట్ : సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి గురువారం కొత్తగా 24 నామినేషన్లు దాఖలయ్యాయి. దీంతో మొత్తం నామినేషన్లు 50 కి చేరాయి. కాంగ్రెస్ అభ్యర్థిగా శ్రీగణేశ్ నారాయనన్ (3), బీఆర్ఎస్ నుంచి జి. నివేదిత (3), బీజేపీ అభ్యర్థి డాక్టర్ టీఎన్ వంశ తిలక్ (4) బీజేపీ రెబెల్ అభ్యర్థిగా ఎం.ఏ. శ్రీనివాస్ (2), కేంద్ర మాజీ మంత్రి సర్వే సత్యనారాయణ కాంగ్రెస్ తరఫున రెండు, ఇండిపెండెంట్గా మరో రెండు సెట్ల నామినేషన్ వేశారు. వీరితో పాటు బహుజన్ ముక్తి పార్టీ నుంచి యు. రాజేందర్ (3), శ్రమజీవి పార్టీ నుంచి జాజుల భాస్కర్ (2), ధర్మ సమాజ్ పార్టీ తరఫున జి. నర్సింగ్ రావు (2), అలయన్స్ డెమక్రటిక్ రిఫార్మ్ పార్టీ నుంచి నాగినేని సరిత, తెలంగాణ రిపబ్లికన్ పార్టీ నుంచి యాదీశ్వర్ నక్క, ఇండిపెండెంట్లుగా బంగారు రాజు, జే. నర్సింగ్ రావు (2), జీడిమడ్ల రాజ్కుమార్ (2), ఎం. జైరామ్ (3), ఈ. శంకర్ (2), దండే రత్నం (3), రేకల సైదులు, బండారు నాగరాజు, సంజీవులు (2), దూడ మహిపాల్, పొన్నాల రాజేందర్ (4), బండారి రాజేశ్, డి. కృష్ణవేణి, ఎం. రాజహంస రాజేశ్ నామినేషన్లు వేశారు. శుక్రవారం నామిఇనేషన్ల పరిశీలన చేపట్టనున్నారు. ఈ నెల 29 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉంది. మొత్తంగా 24 మంది అభ్యర్థులు 50 నామినేషన్లు దాఖలు చేశారు.
జనరల్ అబ్జర్వర్గా ప్రియాంక శుక్లా..
కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నికకు జనరల్ అబ్జర్వర్ గా నియమితులైన ప్రియాంక శుక్లా గురువారం కంటోన్మెంట్ బోర్డు కార్యాలయాన్ని సందర్శించారు. ఎన్నికల అధికారి మధుకర్ నాయక్ ఆమెకు పూల బోకే అందజేసి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎన్నికల నామినేషన్ ప్రక్రియపై ప్రియాంక శుక్లా వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఎన్నికల నిర్వహణలో ఏమైనా సందేహాలు తలెత్తినా.. కోడ్ ఉల్లంఘన తదితర సమస్యలపై ప్రియాంక శుక్లాను 7337047776లో సంప్రదించవచ్చు.