సంగారెడ్డి పట్టణంలో నీటి సరఫరా నిలిచిపోయిందనడంలో వాస్తవం లేదు : అదనపు కలెక్టర్
సంగారెడ్డి పట్టణంలో గత మూడు రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయిందరడంలో వాస్తవం లేదని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల) చంద్రశేఖర్ అన్నారు.
దిశ, సంగారెడ్డి : సంగారెడ్డి పట్టణంలో గత మూడు రోజులుగా నీటి సరఫరా నిలిచిపోయిందరడంలో వాస్తవం లేదని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థల) చంద్రశేఖర్ అన్నారు. సోమవారం ఈ సందర్భంగా అంగడిపేట మంజీరా పైప్ లైన్ పరిశీలించిన జిల్లా అదనపు కలెక్టర్ చంద్రశేఖర్ సంగారెడ్డి పట్టణ మున్సిపల్ కమిషనర్ ,సిబ్బందితో కలిసి పైప్ లైన్ మరమ్మత్తు పనులు పరిశీలించారు. అనంతరం ఐదో వార్డులో పర్యటించి నీటి సరఫరా సమస్యలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సంగారెడ్డి పట్టణానికి అంగడిపేట నుండి మంజీరా ఇంటేక్ వెల్ 600 మీటర్ల వ్యాసం గల పైప్ లైన్ ద్వారా నిరంతరం నీటి సరఫరా జరుగుతుందన్నారు. ఈ పైప్ లైన్ శనివారం రాత్రి బ్రేక్ కావడంతో జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు వెంటనే ఆదివారం మరమ్మత్తు పనులు పూర్తి చేసినట్లు తెలిపారు. మరమ్మత్తుల అనంతరం నీటి సరఫరా తిరిగి ప్రారంభించినట్లు తెలిపారు. సంగారెడ్డి మున్సిపల్ పట్టణంలోని 1, 2, 3, 5, 18, 22, ఆరు వార్డులలో ఆదివారం ఉదయం మాత్రమే నీటి సరఫరా జరగలేదని తెలిపారు. సంగారెడ్డి పట్టణంలో, నీటి సరఫరాలో అంతరాయం కలగకుండా ట్రాక్టర్ల ద్వారా నీటి సరఫరా చేయడం జరిగిందని తెలిపారు.