రాహుల్ గాంధీతోనే దేశ ప్రగతి : మంత్రి కొండా సురేఖ

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే దేశం ప్రగతి పథంలో దూసుకుపోతోందని తెలంగాణ రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు.

Update: 2024-05-08 15:06 GMT

దిశ, నర్సాపూర్ : కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే దేశం ప్రగతి పథంలో దూసుకుపోతోందని తెలంగాణ రాష్ట్ర అటవీ పర్యావరణ దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ అన్నారు. బుధవారం నర్సాపూర్ లో రాహుల్ గాంధీ సభ ఏర్పాట్లను ఏఐసీసీ పర్యవేక్షకులు సురేష్, మెదక్ పార్లమెంట్ పరిశీలకులు విశ్వనాథ్ తో పాటు కాంగ్రెస్ పార్టీ ఇతర నాయకులతో కలిసి పరిశీలించారు. రాహుల్ గాంధీ దిగే హెలిప్యాడ్ పనులను పర్యవేక్షించి పలు సూచనలు చేశారు. ఈనెల 9 న కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ పాల్గొనే బహిరంగ సభకు లక్షలాదిగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం దుబ్బాక నియోజకవర్గంలో ప్రచారం నిర్వహిస్తున్న మెదక్ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థి నీలం మధు, దుబ్బాక నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ చెరుకు శ్రీనివాస్ రెడ్డిలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ పదేళ్లు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలు ప్రజలకు చేసిందేమీ లేదని విమర్శించారు. దేశంలో మోదీ

     విభజన రాజకీయాలు చేస్తే రాష్ట్రంలో కేసీఆర్ తెలంగాణను అవినీతికి కేరాఫ్ గా మార్చడంతో పాటు అప్పుల కుప్పగా మార్చారని ఆరోపించారు. కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే మళ్లీ భారత్ అభివృద్ధి బాటలో పయనిస్తుందని తెలిపారు. మహానేత ఇందిరమ్మ ప్రాతినిధ్యం వహించిన మెదక్ పార్లమెంటు స్థానంలో బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు అగ్రకులాల అభ్యర్థులకు పోటీ చేసే అవకాశం కల్పిస్తే కాంగ్రెస్ పార్టీ మాత్రం బీసీ బిడ్డ నీలం మధుకు అవకాశం ఇచ్చిందన్నారు. దుబ్బాక నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి ఓడిపోయిన శ్రీనివాస్ రెడ్డి దుబ్బాక అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నాడని అభినందించారు. ఇప్పటికే దుబ్బాక నియోజకవర్గం నిధులు తెచ్చి అభివృద్ధి చేస్తున్నాడని, పార్టీలకతీతంగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను అందరికీ అందిస్తున్నాడన్నారు. ఈ ఎన్నికల్లో ఎంపీగా నీలం మధును గెలిపిస్తే కేంద్ర ప్రభుత్వం నుంచి మరిన్ని నిధులు తీసుకువచ్చి దుబ్బాక నియోజకవర్గం అభివృద్ధి పథంలోకి తీసుకు వెళ్తాడని భరోసా ఇచ్చారు. ప్రజల్లో కాంగ్రెస్ పార్టీకి వస్తున్న ఆదరణ చూసి జీర్ణించుకోలేని బీఆర్ఎస్ పార్టీ బీజేపీ కి తొత్తుగా మారి మన ముందుకు వస్తున్నారని ఆరోపించారు.

    జైల్లో పడిన కవితను కాపాడుకోవడానికి కేసీఆర్ ప్రయత్నం చేస్తున్నారని, దీనిని ప్రజలందరూ గమనించాల్సిన అవసరం ఉందన్నారు. మాజీ సీఎం కేసీఆర్ బీజేపీతో చీకటి ఒప్పందం చేసుకున్నారని, ఎన్నికలలో ఆ పార్టీకి లాభం చేకూరేలా పనిచేస్తున్నారని పేర్కొన్నారు. బీజేపీ ప్రభుత్వం రాబోతుందని కలలు కంటోందని, కానీ ఆ పార్టీ ఓటమి పాలు కాబోతుందని చెప్పారు. దేవుళ్ల పేరుతో రాజకీయాలు చేసి ప్రజలను మోసం చేయవద్దని సూచించారు. మెదక్ గడ్డ నుంచి ఇందిరా గాంధీ ప్రాతినిధ్యం వహించి ఎంతో అభివృద్ధిని చేశారని చెప్పారు. అలాంటి గడ్డపై నుంచి 25 ఏళ్ల తర్వాత నీలం మధు గెలుపు ద్వారా కాంగ్రెస్ జెండా ఎగరబోతుందని స్పష్టం చేశారు.

    నీలం మధు పార్లమెంట్లో అడుగు పెట్టబోతున్నారని స్పష్టం చేశారు. పార్లమెంట్ పరిధిలోని నేతలంతా భారీ జన సమీకరణ చేసి రాహుల్ గాంధీ బహిరంగ సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మల్యేలు మధన్ రెడ్డి, మైనంపల్లి హనుమంత్ రావు, మాజీ ఎమ్మెల్సీ ఆర్. సత్యా నారాయణ, డీసీసీ అధ్యక్షులు ఆంజనేయులు గౌడ్,నియోజకవర్గ ఇన్చార్జ్లు ఆవుల రాజీ రెడ్డి, చెరుకు శ్రీనివాస్ రెడ్డి, గాలి రెడ్డి, మోహన్ రెడ్డి, పద్మారెడ్డి, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.

Similar News