కాంగ్రెస్ ను నమ్మొద్దు.. బీజేపీ మాయలో పడొద్దు...

కాంగ్రెస్ ను నమ్మొద్దని.. బీజేపీ మాయలో పడొద్దని మెదక్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి సూచించారు.

Update: 2024-05-02 10:26 GMT

దిశ, పాపన్నపేట : కాంగ్రెస్ ను నమ్మొద్దని.. బీజేపీ మాయలో పడొద్దని మెదక్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్ రెడ్డి సూచించారు. గురువారం మండల కేంద్రం పాపన్నపేటలో మెదక్ లోక్ సభ స్థానం బీఆర్​ఎస్​ అభ్యర్థి వెంకట్రామిరెడ్డికి మద్దతుగా ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ముందుగా సాలన్ చెరువులో ఉపాధి హామీ కూలీలను కలిసి వారితో ముచ్చటించారు. అనంతరం ఇంటింటి ప్రచారం నిర్వహించగా గ్రామస్తులు బ్రహ్మరథం పట్టారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. 420 హామీలు.. 6 గ్యారంటీలు ఇస్తామని ఉత్త మాటలు, ఉద్దెర హామీలు ఇచ్చిన కాంగ్రెస్ ను నమ్మి ఇప్పటికే ప్రజలు మోసపోయి గోసపడుతున్నారని ఆరోపించారు.

    అధికారం చేపట్టగానే రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పి ప్రజలను నిలువునా ముంచారని మండిపడ్డారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు, గ్యారంటీలను నెరవేర్చేదాక బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదని.. ప్రభుత్వం మెడలు వంచి ప్రజలకు హామీలు, గ్యారెంటీలను అందేలా చూస్తామని పేర్కొన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలకు మోసపు మాటలు చెప్పి అధికారం చేపట్టిన కాంగ్రెస్ పార్టీకి ఈ పార్లమెంట్ ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని ప్రజలకు విన్నవించారు. బీఆర్​ఎస్​ అభ్యర్థి వెంకటరామిరెడ్డి సేవ చేసేందుకు వస్తున్నాడని.. ఆశీర్వదించి కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఆమె వెంట మాజీ సర్పంచులు గురుమూర్తి గౌడ్, బద్రి మల్లేశం, నవీన్ గౌడ్, నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, శ్రీనివాస్, సాయి రెడ్డి, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు. 

Similar News