ప్రచారంలో దూసుకుపోతున్న నీలం మధు.. మెదక్ పార్లమెంట్ అభివృద్ధిపై కీలక హామీ

మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు బుధవారం బీహెచ్ఈఎల్ గ్రౌండ్‌లో వాకర్లతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ...

Update: 2024-05-01 05:26 GMT

దిశ, పటాన్‌చెరు: మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నీలం మధు బుధవారం బీహెచ్ఈఎల్ గ్రౌండ్‌లో వాకర్లతో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఉదయాన్ని గ్రౌండ్‌ వద్దకు వెళ్లి వాకర్లు, ఎంప్లాయిస్, రిటైర్డ్ ఎంప్లాయిస్, సీనియర్ సిటిజన్లు, యువతను కలిశారు. వారితో కలిసి వాకింగ్ చేశారు. క్రికెట్ ఆడి క్రీడాకారుల్లో ఉత్సాహాన్ని నింపారు. అనంతరం వారితో ముచ్చటించారు. ముఖ్యంగా బీహెచ్ఈఎల్ గ్రౌండ్‌తోపాటు స్థానికంగా నెలకొన్న సమస్యలను నీలం మధుకు వివరించారు.


అనంతరం నీలం మధు మాట్లాడుతూ కాంగ్రెస్ హయాంలోనే మెదక్ పార్లమెంట్ అభివృద్ధిలో దూసుకుపోయిందన్నారు. మెదక్ గడ్డ నుంచి ఎంపీగా పోటీ చేసి ప్రధాని అయిన స్వర్గీయ ఇందిరా గాంధీ పరిశ్రమలను తీసుకొచ్చి ఉపాధి కల్పించారని నీలం మధు వెల్లడించారు. ఈ ప్రాంతంలో బీహెచ్ఈఎల్‌ను నెలకొల్పడం ద్వారా వేలాదిమందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు దక్కాయన్నారు. అలాగే బీడీఎల్, ఈక్రిశాట్, ఓడీఎఫ్ వంటి గవర్నమెంట్ సెక్టార్లన్నీ మెదక్ జిల్లాలో నెలకొల్పడం జరిగిందని గుర్తు చేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సంక్షేమం కోసం పాటుపడుతోందన్నారు. దేశంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఖాయమని, రాహుల్ గాంధీ నేతృత్వంలో పాంచ్ గ్యారెంటీలను అమలు చేసి తీరుతామన్నారు.


ఒకసారి ఎంపీగా తనకు అవకాశం కల్పిస్తే మన ప్రాంతాన్ని మళ్ళీ అభివృద్ధి పథంలో నడిపించుకుందామని స్పష్టం చేశారు. యువత ఆలోచించి కాంగ్రెస్ పార్టీకి ఓటేయాలని విజ్ఞప్తి చేశారు. తాను ఎంపీగా గెలిచాక ఎంపీ, సీఎస్ఆర్ ఫండ్స్‌తో వాకింగ్ ట్రాక్‌ల అభివృద్ధి, ఇండోర్ స్టేడియంలో ఏర్పాటుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి మేడే శుభాకాంక్షలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఐఎన్‌టీయూసీ జిల్లా అధ్యక్షుడు కొల్లూరు నరసింహారెడ్డి, కొల్లాపూర్ మున్సిపల్ చైర్మన్ ప్రభాకర్ రెడ్డి,113 డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్, మైనార్టీ నాయకులు అన్వర్ పటేల్, అరుణ్ గౌడ్, శేఖర్, మెట్టు కృష్ణ, తూర్పు శ్రీను, బిహెచ్ఈఎల్ ఐ‌ఎన్టీయూసీ కార్మికులు, నాయకులు పాల్గొన్నారు.

Tags:    

Similar News