‘పిల్లల్ని కాల్చి చంపిన చరిత్ర నీది’.. RS ప్రవీణ్ కుమార్పై మల్లు రవి సంచలన వ్యాఖ్యలు
బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై కాంగ్రెస్ సీనియర్ లీడర్, మాజీ ఎంపీ మల్లు రవి ఫైర్ అయ్యారు. ఆదివారం ఆయన గాంధీభవన్లో
దిశ, వెబ్డెస్క్: బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై కాంగ్రెస్ సీనియర్ లీడర్, మాజీ ఎంపీ మల్లు రవి ఫైర్ అయ్యారు. ఆదివారం ఆయన గాంధీభవన్లో మీడియాతో మాట్లాడుతూ.. కరీంనగర్లో ఎస్పీగా ఉన్నప్పుడు బడుగు, బలహీన వర్గాల పిల్లల్ని కాల్చి చంపిన చరిత్ర నీదని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్పై సంచలన వ్యాఖ్యలు చేశారు. కొల్లాపూర్లో బుల్డోజర్లతో ఇండ్లు కూల్చుతున్నారని ప్రవీణ్ కుమార్ మతిస్థిమితం లేకుండా మాట్లాడుతున్నాడని ఫైర్ అయ్యారు. బుల్డోజర్ విధానానికి కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకమని అన్నారు. అచ్చంపేటని కల్లోలిత ప్రాంతంగా ప్రకటించాలన్న ఆర్ఎస్పీ వ్యాఖ్యలను ఖండిస్తున్నానని, వాస్తవ పరిస్థితులు తెలుసుకోకుండా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్లోలిత ప్రాంతాల్లో ఎన్ కౌంటర్లు చేసినట్టు అనుకుంటున్నవా..? అని చురుకలంటించారు.
ప్రవీణ్ కుమార్ అనంతపురంలో ఎస్పీగా పని చేసినప్పుడే పరిటాల రవి హత్య జరిగిందని, అప్పుడు నీ మీద అప్పటి ప్రభుత్వం చర్యలు తీసుకుందా అని ప్రశ్నించారు. కొల్లాపూర్లో హత్యకు గురైన శ్రీధర్ రెడ్డి మర్డర్ వెనక ఎవరున్నారు.. ఏంటి అని విచారణ జరుగుతుందని దోషులను పోలీసులు త్వరలోనే పట్టుకుంటారని తెలిపారు. గతంలో ఐపీఎస్గా పని చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దారి తప్పిన పోలీసు లాగా మాట్లాడుతున్నారని అసహనం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, కేటీఆర్ వ్యూహాలను ప్రవీణ్ కుమార్ అమలు చేస్తున్నాడని, బీఎస్పీలో ఆయన చేరింది కూడా కేసీఆర్ ఆదేశాల మేరకేననే విషయం అందరికి తెలుసని కీలక వ్యాఖ్యలు చేశారు. బీఎస్పీలో ఉన్నప్పుడు ఉన్నప్పుడు కేసీఆర్ని తిట్టి.. బీఆర్ఎస్లో చేరి ఆ పార్టీ టికెట్ తీసుకుని పోటీ చేశారని విమర్శించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కేసీఆర్ చేతిలో ఒక ఆటబొమ్మ అని మల్లు రవి ఎద్దేవా చేశారు.