సమైక్య రాష్ట్రంలో కరెంట్ లేక పరిశ్రమల మూత: మంత్రి శ్రీనివాస్ గౌడ్

సమైక్య రాష్ట్రంలో కరెంట్ కష్టాల వల్ల రాష్ట్రంలో అనేక పరిశ్రమలు మూత పడ్డాయని, భవిష్యత్ లో కరెంట్ వస్తుందో లేదోనని పారిశ్రామికవేత్తలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయారని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

Update: 2023-06-06 15:51 GMT

దిశ, మహబూబ్ నగర్: సమైక్య రాష్ట్రంలో కరెంట్ కష్టాల వల్ల రాష్ట్రంలో అనేక పరిశ్రమలు మూత పడ్డాయని, భవిష్యత్ లో కరెంట్ వస్తుందో లేదోనని పారిశ్రామికవేత్తలు ఇతర రాష్ట్రాలకు తరలిపోయారని రాష్ట్ర ఎక్సైజ్, క్రీడలు, పర్యాటక శాఖ మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. రాష్ట్ర దశాబ్ధి ఉత్సవాలలో భాగంగా మంగళవారం స్థానిక శిల్పారామంలో ఏర్పాటు చేసిన తెలంగాణ పారిశ్రామిక ప్రగతి ఉత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. సమైక్య రాష్ట్రంలో కరెంట్ ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో తెలియని దుస్థితి నుంచి నేడు నిరంతర విద్యుత్ తో రాష్ట్రంలో నూతన పరిశ్రమల ఏర్పాటుకు ఊతం లభించిందని అన్నారు.

సింగిల్ విండో విధానంలో టీఎస్ ఐపాస్ ద్వారా నిర్ణీత సమయంలో ఎలాంటి కొర్రీలు లేకుండా పరిశ్రమల స్థాపనకు అవకాశం ఏర్పడిందన్నారు. పరిశ్రమలకు కనీస అవసరమైన నీరు, కరెంట్ వంటి మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నందుకే పెద్ద పెద్ద పరిశ్రమలు తెలంగాణలో పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తున్నాయని ఆయన అన్నారు. రాష్ట్రం వచ్చిన తర్వాత జిల్లాలో 758 సూక్ష్మ, 105 చిన్న, 23 భారీ, 3 మెగా తరహా పరిశ్రమలు జిల్లాలో ఏర్పాటు చేసినట్లు, రాష్ట్రంలో పరిశ్రమలకు 24 గంటల కరెంట్ ను ఇస్తున్నామని అందుకే పారిశ్రామికవేత్తలు పెట్టుబడి పెట్టడానికి ముందుకు వస్తున్నారని ఆయన తెలిపారు.

జిల్లా కలెక్టర్ రవి నాయక్ మాట్లాడుతూ.. జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు మంత్రి డాక్టర్ వి శ్రీనివాస్ గౌడ్ ఎంతో కృషి చేస్తున్నారని ఫలితంగా లిథియం దిగా ఫ్యాక్టరీ ఏర్పాటు అయిందని భవిష్యత్ లోనూ అనేక పరిశ్రమలు తరలి రానున్నాయని తెలిపారు. టీఎస్ ఐపాస్ ద్వారా వస్తున్న ఆన్ లైన్ అప్లికేషన్లు ఎప్పటికప్పుడు పరిష్కరిస్తూ వాటికి అనుమతులు మంజూరు చేస్తున్నామని ఆయన తెలిపారు. పరిశ్రమల సూక్ష్మ, చిన్న, భారీ, మెగా పరిశ్రమలలో చక్కని ప్రతిభ కనబరిచిన వారిని మంత్రి ఈ సందర్భంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ బాబూరావు, మైనింగ్ శాఖ ఏడీ విజయకుమార్, వ్యవసాయ శాఖ జేడీ వెంకటేష్, డీఐఓ మూర్తి, ఎల్ డిఎం భాస్కర్, డిఫ్యూటీ లేబర్ కమిషనర్ చంద్రశేఖర్ గౌడ్, పారిశ్రామికవేత్తలు సి భాస్కర్, కృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News