బుర్ఖా ముసుగులో బోగస్ ఓట్లు..హైదరాబాద్లో లక్ష మెజారిటీతో గెలుస్తాం: ఎమ్మెల్యే రాజాసింగ్
హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో బుర్ఖా ముసుగులో బోగస్ ఓట్లు నమోదవుతున్నాయని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో బుర్ఖా ముసుగులో బోగస్ ఓట్లు నమోదవుతున్నాయని గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సోమవారం ఓటు హక్కు వినియోగించుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ఓవైసీ జులుం ఖతం చేయాలంటే హైదరాబాద్ పార్లమెంట్ పరిధిలో ఉన్న 40 శాతం ఉన్న హిందువులంతా ఓటు వేయాలని ఆయన కోరారు. ఇదిలా ఉండగా బీజేపీ అధికారంలోకి వస్తే ముస్లింలకు రాజ్యాంగ విరుద్ధంగా ఇస్తున్న 4 శాతం రిజర్వేషన్ తొలగిస్తామన్నారు. హైదరాబాద్ పార్లమెంట్లో లక్ష మెజారిటీతో గెలుస్తామని ధీమా వ్యక్తంచేశారు. తమకు ఒక్క అవకాశం ఇస్తే కేంద్రం నుంచి నిధులు తీసుకొచ్చి పాతబస్తీని కొత్త బస్తీ గా మారుస్తామన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ రాజ్యం ఉందని, రూ.12 లక్షల కోట్ల అవినీతి చేసిన కాంగ్రెస్ తెలంగాణను పాలిస్తోందని విమర్శించారు. కాంగ్రెస్ కు అవకాశం ఇస్తే అవినీతి తప్పితే.. మరొకటి ఉండదని ఆయన పేర్కొన్నారు.