పాఠశాలలు పున:ప్రారంభం నాటికి ఏకరూప దుస్తులు అందించాలి

పాఠశాలలు పున:ప్రారంభం నాటికి ఏకరూప దుస్తులు అందించాలని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు.

Update: 2024-05-22 11:59 GMT

దిశ, ఖమ్మం రూరల్ : పాఠశాలలు పున:ప్రారంభం నాటికి ఏకరూప దుస్తులు అందించాలని జిల్లా కలెక్టర్ వీపీ గౌతమ్ అన్నారు. బుధవారం కలెక్టర్, ఖమ్మం రూరల్ మండలం, జలగం నగర్ లోని మహిళా శక్తి కుట్టు కేంద్రాన్ని సందర్శించి ఏకరూప దుస్తుల తయారీని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలు, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ గురుకులాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు ఏకరూప దుస్తుల అందజేతకు చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో 248837 మంది విద్యార్థులు ఉండగా, ఇందులో 115990 మంది బాలురు, 132857 మంది బాలికలు ఉన్నట్లు ఆయన అన్నారు.

    1185 మంది స్వయం సహాయక సంఘాల సభ్యులను గుర్తించి, ఏకరూప దుస్తుల తయారీకి చర్యలు చేపట్టినట్లు తెలిపారు. విద్యార్థుల వారీగా కొలతలు తీసుకొని, మహిళా శక్తి కుట్టు కేంద్రాలకు తయారీకి అప్పజెప్పినట్లు పేర్కొన్నారు. జలగం నగర్ మహిళా కుట్టు కేంద్రంలో 19 కుట్టు మిషన్లు ఉండగా, కటింగ్ మిషన్, కాజా మిషన్, బటన్ మిషన్ లు సమకూర్చినట్లు తెలిపారు. మిషన్ల ఆపరేటింగ్ నేర్చుకొని మరికొందరికి నేర్పాలన్నారు. ప్రభుత్వ పాఠశాలల పిల్లలకు ఏకరూప దుస్తులు అందడంతో

    పాటు, స్వయం సహాయక సంఘాల వారికి ఉపాధికల్పన జరుగుతుందని కలెక్టర్ తెలిపారు. సందర్శన సందర్భంగా కలెక్టర్ స్వయం సహాయక సంఘ సభ్యులతో మాట్లాడారు. సంఘ సభ్యులు మహిళలు ఆర్థికంగా నిలదొక్కుకునే విధంగా ప్రభుత్వం ఆసరా ఇస్తున్నదని చెప్పారు. మహిళా సంఘాలకు ఏకరూప దుస్తుల ఆర్డర్ ఇవ్వడమే కాక కటింగ్, కాజా, బటన్ మిషన్ల కొనుగోలుకు ప్రభుత్వం తోడ్పాటు ఇచ్చిందని, ఇది ఎంతో సంతోషకరమని అన్నారు. కలెక్టర్ తనిఖీ లో ఖమ్మం రూరల్ మండలం ఎంపీడీఓ ఎస్. కుమార్, ఏపీఎం ఎం. శ్రీనివాసరావు, సీసీ బి. మోహన్ రావు, కె. శారద, అధికారులు తదితరులు ఉన్నారు. 

Similar News