శభాష్ మనోజ్…. నిప్పంటించుకున్న వ్యక్తిని కాపాడిన పోలీస్

పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని కాపాడాడు ఓ పోలీస్ కానిస్టేబుల్..

Update: 2024-05-10 14:03 GMT

దిశ, అశ్వారావుపేట: పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన వ్యక్తిని కాపాడాడు ఓ పోలీస్ కానిస్టేబుల్.. రక్షకభటుడు అన్న పదానికి తగ్గట్టుగా ధైర్యంగా వ్యవహరించాడు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల కేంద్రం నందమూరి కాలనీ వద్ద శుక్రవారం సాయంత్రం కుటుంబ కలహాల నేపథ్యంలో.. గుజరాతి రాహుల్ (43) అనే వ్యక్తి భార్యపై కోపంతో ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు పట్టించుకున్నాడు.

అదే సమయంలో పోలీస్ పెట్రోలింగ్ చేస్తూ అటుగా వెళ్తున్న కానిస్టేబుల్ సోమవరపు మనోజ్ కుమార్ సమయస్ఫూర్తితో స్పందించి ఇసుక, మట్టి జల్లి మంటలను ఆర్పి వేశాడు. కాలిన గాయాలతో ఉన్న బాధితుడిని హుటాహుటిన అంబులెన్స్ లో ఆసుపత్రికి తరలించాడు. ఓ వ్యక్తి ప్రాణాలను నిలిపేందుకు చాకచక్యంగా వ్యవహరించిన కానిస్టేబుల్ సోమవారపు మనోజ్ కుమార్ ను శభాష్ పోలీసు అంటూ ప్రశంసిస్తున్నారు. గాయాల పాలైన బాధితుడిని మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు.


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !


Similar News