ఖమ్మం అభివృద్ధిని పట్టించుకోని ప్రజాప్రతినిధులు
ఖమ్మం జిల్లా అభివృద్ధిని పట్టించుకున్న ప్రజాప్రతినిధులు లేకుండా పోయారని బీజేపీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు అన్నారు.
దిశ, కారేపల్లి : ఖమ్మం జిల్లా అభివృద్ధిని పట్టించుకున్న ప్రజాప్రతినిధులు లేకుండా పోయారని బీజేపీ ఖమ్మం పార్లమెంట్ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు అన్నారు. గురువారం కారేపల్లిలో బీజేపీ ప్రచారాన్ని నిర్వహించింది. అంబేద్కర్ సెంటర్ నుండి బస్టాండ్ సెంటర్ వరకు రోడ్ షో నిర్వహించారు. ఈ సందర్బంగా వినోద్రావు మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలో పరిశ్రమలు, యూనివర్సిటీలు, ఆసుపత్రులు, ఉన్నత విద్యాసంస్ధలను రప్పించటంలో ప్రజాప్రతినిధులు విఫలమైనారని ఆరోపించారు. ఉన్నత విద్యకు, వైద్యం కోసం
పట్టణాలకు వెళ్లాల్సిన దుస్థితిని కల్పించారన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ అభివృద్దికి మోడల్ అని కొనియాడారు. తనను గెలిపిస్తే కేంద్రం నుండి రూ.వేల కోట్లు రప్పించి అభివృద్ధి చేసి చూపుతానని హామీ ఇచ్చారు. తాను ఖమ్మం గడ్డ బిడ్డనని ఇప్పటికే స్వచ్ఛంద సంస్థలతో గిరిజనులకు సేవ చేస్తున్నానన్నారు. ప్రభుత్వం ద్వారా ప్రజా సేవకు మీ దగ్గరకు వచ్చానని ఆశీర్వదించాలని కోరారు. బీజేపీ కేంద్ర నాయకులు కమల్చంద్ర బంజ్ దేవ్ మాట్లాడుతూ భారత్ భద్రత, దేశాభివృద్ధి బీజేపీతోనే సాధ్యమన్నారు. కోవిడ్ మహమ్మరిని ఎదుర్కొని ప్రజలను కాపాడిన ధీరుడు మోడీ అని కొనియాడారు. ప్రతి ఒక్కరికి గూడు, ఇంటింటికి నీరు అందిస్తున్న ఘనత ప్రధాని మోడీదేనన్నారు. అభి వృద్ది కోసం బీజేపీ కి ఓటు వేయాలని కోరారు.
బీఆర్ఎస్ నుండి బీజేపీలో చేరికలు
బీఆర్ఎస్ పార్టీకి చెందిన వార్డు సభ్యులు, కార్యకర్తలు బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు సమక్షంలో బీజేపీలో చేరారు. వారికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అజ్మీర వీరన్న ఆధ్వర్యంలో ఇటీవల పార్టీలో చేరిన ప్రజాప్రతినిధులు బీజేపీ రోడ్ షోకు జనాలకు సమీకరించారు. రోడ్ షో కు టీడీపీ, ఎంఆర్పీఎస్ శ్రేణులు హాజరైనారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా ప్రధానకార్యదర్శి శ్యామ్ రాధోడ్, కృష్ణరాధోడ్, అజ్మీర వీరన్న, కల్తి రాంప్రసాద్, తురక నారాయణ, దనసరి శ్రీనివాస్, భూక్యా సుజాత, మాజీ సర్పంచ్లు భూక్యా రంగారావు, ఈసం అరుణ, అజ్మీర అరుణ, దారావత్ రాజు, టీడీపీ మండల అధ్యక్షులు పోలూరి రామారావు, బోడ మంగిలాల్ తదితరులు పాల్గొన్నారు.