కారేపల్లి మండలంలో వడగండ్ల బీభత్సం
కారేపల్లి మండలంలో ఆదివారం వడగండ్ల వాన బీభత్సాన్ని సృష్టించింది.
దిశ, కారేపల్లి : కారేపల్లి మండలంలో ఆదివారం వడగండ్ల వాన బీభత్సాన్ని సృష్టించింది. ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వడగండ్లవాన పడింది. రోడ్ల మీడ వడగండ్ల రాళ్లు పడుతుండటంతో వాహనాలను పక్కకు నిలిపివేశారు. రేగులగూడెం సమీపంలో గ్రామానికి, వ్యవసాయ బావులకు విద్యుత్ సరఫరా అయ్యే విద్యుత్ స్తంభాలు గాలికి నేలకూలాయి. రోడ్డు పక్కన విద్యుత్ స్తంభం పడిపోవటంతో రోడ్డుపై విద్యుత్ వైర్లు పడి పోయి నాల్గు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. జమాళ్లపల్లి సమీపంలో చేనులో పని చేస్తుండగా పిడుగు పడటంతో పేరుపల్లికి చెందిన తెలగొర్ల భద్రి, మరొకరికి గాయాలైనాయి. వారిని అసుపత్రికి తరలించారు. కారేపల్లి వడగండ్ల వానలో వానరాళ్లను సేకరించటానికి పిల్లలు పోటీలు పడ్డారు. అరగంట సేపు వడగండ్ల వాన పడటంతో మామిడి తోటలలో కాయలు నేలపాలైనాయి.