తీన్మార్ మల్లన్నకే మద్దతు.. ప్రకటించిన మూడు పార్టీల కీలక నేతలు
సీఎం రేవంత్ రెడ్డితో కాసేపటి క్రితం సీపీఐ, సీపీఎం, తెలంగాణ జనసమితి ముఖ్య నేతలు భేటీ అయ్యారు.
దిశ, వెబ్డెస్క్: సీఎం రేవంత్ రెడ్డితో కాసేపటి క్రితం సీపీఐ, సీపీఎం, తెలంగాణ జనసమితి ముఖ్య నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మూడు పార్టీల ముఖ్యనేతలు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తున్నట్లు ప్రకటించారు. సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని మాట్లాడుతూ.. నల్లగొండ-వరంగల్-ఖమ్మం ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధిని గెలిపించాలని కోరారు. ఇవాల్టితో ప్రచార ప్రక్రియ పూర్తవుతోందని.. ప్రజాస్వామ్యం బతకాలంటే తీన్మార్ మల్లన్న గెలవాలన్నారు.
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ను గెలిపించేందుకు సీపీఐ నాయకులు కృషి చేయాలని పిలుపునిస్తున్నామన్నారు. తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని పిలుపునిచ్చారు. పొత్తులో భాగంగా సీపీఐ కాంగ్రెస్కు పూర్తి మద్దతు ప్రకటిస్తున్నామని స్పష్టం చేశారు. అనంతరం టీజేఎస్ చీఫ్ ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్కు వ్యతిరేకంగా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు మద్దతుగా నిలిచామని గుర్తు చేశారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మా మద్దతు కాంగ్రెస్కు ఉంటుందని ఇప్పటికే స్పష్టం చేశామని తెలిపారు. మార్పు కోసం అందరం కలిసి కాంగ్రెస్ను గెలిపించాలని పిలుపునిచ్చారు. ప్రజాస్వామ్య పాలనను బలోపేతం చేసేందుకు కాంగ్రెస్ను గెలిపించాలని కోరుతున్నామన్నారు. ప్రజా సంక్షేమం వర్ధిల్లాలంటే కాంగ్రెస్ ను గెలిపించాలని కోరారు. కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న గెలుపు కోసం కృషి చేయాలని జనసమితి కార్యకర్తలకు కూడా విజ్ఞప్తి చేస్తున్నా అన్నారు. సీపీఎం కీలక నేత ఎస్.వీరయ్య మాట్లాడుతూ.. ఈ నెల 27న జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సీపీఎం కూడా కాంగ్రెస్కు మద్దతు పలుకుతోందన్నారు. విద్యాధికులు లోతుగా ఆలోచించాలన్నారు. ప్రస్తుత సామాజిక, రాజకీయ పరిస్థితులను అర్థం చేసుకుని ఓటు వేయండని సూచించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్నను గెలిపించండని పిలుపునిచ్చారు.