ట్రాన్స్ జెండర్లకు ఆత్మవిశ్వాసం.. ఆర్థిక స్వావలంబనతో స్వయం అభివృద్ధికి శ్రీకారం

సమాజంలో అవమానాలను ఎదుర్కొంటున్న ట్రాన్స్ జెండర్లు

Update: 2024-05-26 12:13 GMT

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి : సమాజంలో అవమానాలను ఎదుర్కొంటున్న ట్రాన్స్ జెండర్లు ఆర్థికంగా నిలదొక్కుకొని ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లేందుకు మార్గం సుగమం అయింది. రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ట్రాన్స్ జెండర్ల ఆర్థిక స్వావలంబన.. స్వయం అభివృద్దికి ప్రభుత్వం జనవరిలో ప్రతిపాదనలకు శ్రీకారం చుట్టింది. వారి స్వయం ఉపాధి కోసం జిల్లాలో పెట్రోల్ పంప్ త్వరలో ఏర్పాటు చేయనుంది. జిల్లాలోని ట్రాన్స్ జెండర్లకు మంచి అవకాశాలు అందించేందుకు పెట్రోల్ పంప్ ఏర్పాటు చేయాలని ప్రణాళికలు రూపొందించారు. అనంతరం ఫిబ్రవరి మాసంలో నిర్వహించిన జిల్లా అభివృద్ధి సమీక్ష సమావేశంలో ఈ అంశాన్ని జిల్లా కలెక్టర్ ప్రత్యేక దృష్టితో వేగవంతంగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ట్రాన్స్ జెండర్లు కూడా తల ఎత్తుకొని గర్వంగా తిరిగే రోజులు రాబోతున్నాయని వారు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

వీ-హబ్ తో ఒప్పందం..

ట్రాన్స్ జెండర్లకు సమాన అవకాశాల చట్టం ప్రకారం జిల్లా యంత్రాంగం కలెక్టర్ అనురాగ్ జయంతి ఆదేశాల మేరకు వారి సంక్షేమానికి కృషి చేస్తోంది. జిల్లాలో ఇప్పటివరకు 25 మంది ట్రాన్స్ జెండర్లకు గుర్తింపు కార్డులు జారీ చేశారు. వారి స్వయం ఉపాధి కోసం వివిధ రకాల శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేసేందుకు వీ-హబ్ తో ఒప్పందం చేసుకున్నారు.

పెట్రోల్ పంప్ ఏర్పాటుకు ఎన్ఓసీ..

ట్రాన్స్ జెండర్లు సమాజంలో మంచి అవకాశాలతో జీవించేందుకు, అలాగే పునరావాసం కోసం దీర్ఘకాలిక లక్ష్యంతో జిల్లా కేంద్రంలో ఒక పెట్రోల్ పంప్ ఏర్పాటు చేసేందుకు ఏర్పాట్లు ముమ్మరం గా కోనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన నో అబ్జెక్షన్ (ఎన్ఓసీ) సర్టిఫికెట్ కూడా ఇచ్చారు. ఇండియన్ ఆయిల్ కంపెనీ వారు ఇక్కడ పెట్రోల్ పంప్ ను మంజూరు చేశారు. ప్రస్తుతం జిల్లా కేంద్రం రెండో బైపాస్ లోని వైద్య కళాశాల ఎదురుగా ఉన్న వి.వింగ్ పార్కులో వీటికి సంబంధించిన నిర్మాణ కార్యక్రమాలు మొదలుపెట్టేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. కలెక్టర్ అనురాగ్ జయంతి ప్రత్యేక పర్యవేక్షణలో కార్యక్రమాలు చురుగ్గా కొనసాగుతున్నాయి. ప్రస్తుతం నిర్మాణ దశలో ఈ కార్యక్రమాలు ఉన్నాయి.

రూ. మూడు కోట్ల వ్యయం..

పెట్రోల్ పంపును దాదాపు రూ. మూడు కోట్ల వ్యయంతో నిర్మించబోతున్నారు. దీని నిర్మాణంతో ఈ పంప్ లో 15 మంది ట్రాన్స్ జెండర్ల కు ప్రత్యక్ష ఉపాధి లభించనుండగా, మరో పదిమందికి పరోక్షంగా ఉపాధి లభించే అవకాశాలు ఉన్నాయి. ఇందులో భాగంగా జిల్లాలోని ట్రాన్స్ జెండర్ల కు అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పూజారి గౌతమి అవగాహన కార్యక్రమాలను ఇటీవల జిల్లా సమీకృత కార్యాలయాల సముదాయంలో నిర్వహించారు. పెట్రోల్ పంప్ నిర్వహణపై ట్రాన్స్ జెండర్లకు త్వరలో శిక్షణ కార్యక్రమాలు కూడా చేపట్టనున్నారు. ఈ మేరకు జిల్లా సంక్షేమ అధికారి (నోడల్ ఆఫీసర్) లక్ష్మీరాజం ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

శాశ్వత ఉపాధికి దొరుకుతుంది : బీ. మధుషా ట్రాన్స్ జెండర్,సిరిసిల్ల

జిల్లా అధికారులు మాకు ఉపాధి కల్పించేందుకు పెట్రోల్ పంప్ ఏర్పాటు చేస్తున్నారు. దీనిపై ఇటీవల సమావేశం నిర్వహించారు. మాకు శాశ్వతంగా పని దొరుకుతుంది. ఆర్థికంగా ఎంతో మేలు చేకూరుతుంది. దీన్ని సద్వినియోగం చేసుకుంటాం.

ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్తాం: పీ.సుప్రియ ట్రాన్స్ జెండర్ల, సిరిసిల్ల

ఇండియన్ ఆయిల్ కంపెనీ ఆధ్వర్యంలో పెట్రోల్ పంప్ ఏర్పాటు చేయడంతో మేము ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు మంచి అవకాశం వచ్చింది. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లేందుకు మార్గం ఏర్పడింది. మిగతా ట్రాన్స్ జెండర్లకు మేము మార్గదర్శకులుగా నిలుస్తాం. సమాజంలో తల ఎత్తుకొని గర్వంగా జీవిస్తాం.

చట్టం స్ఫూర్తితో ముందుకు వెళ్దాం: లక్ష్మీరాజం జిల్లా సంక్షేమ అధికారి(నోడల్ ఆఫీసర్)

ట్రాన్స్ జెండర్ల కోసం భారత ప్రభుత్వం తీసుకొచ్చిన సమాన అవకాశాల చట్టం 2019 ప్రకారం జిల్లా మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు జిల్లాలో పలు వినూత్న అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది.. వారి జెండర్ సెన్సిటివిటీని వారు ఆశించిన విధంగా నమోదు చేయడానికి వారి లింగ మార్పిడి విషయంలో ప్రభుత్వం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం వారికి ఐడీ కార్డులు ఇష్యూ చేస్తున్నాము. అలాగే వారికి శాశ్వత ఉపాధి కోసం జనవరి లో ప్రభుత్వం నుంచి వచ్చిన సూచనలతో పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. జిల్లా కలెక్టర్ అనురాగ్ జయంతి మార్గదర్శకత్వంలో వారిని శిక్షణకు కూడా పంపించడం జరుగుతుంది.

Similar News