నకిలీ గల్ఫ్ ఏజెంట్ల పై పోలీసులు కొరడా

నకిలీ వీసాలు ఇచ్చి విదేశాల్లో ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం వెళ్లే వారిని మోసం చేసే నకిలీ ఏజెంట్లపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు.

Update: 2024-05-26 04:35 GMT

దిశ, రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: నకిలీ వీసాలు ఇచ్చి విదేశాల్లో ఉద్యోగాల కోసం, ఉపాధి కోసం వెళ్లే వారిని మోసం చేసే నకిలీ ఏజెంట్లపై పీడీ యాక్ట్ నమోదు చేస్తామని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. ప్రభుత్వం నుండి ఎటువంటి అనుమతులు లేకుండా మోసాలకు పాల్పడుతున్న నకిలీ ఏజెంట్లపై శనివారం సాయంత్రం సిరిసిల్ల డీఎస్పీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా బృందాలుగా ఏర్పడి ఆకస్మిక తనిఖీలు నిర్వహించి, తనిఖీల్లో తంగాలపల్లి మండలం సారాంపెళ్లి గ్రామానికి చెందిన మహమ్మద్ మహబూబ్, రుద్రంగి మాండలం కేంద్రానికి చెందిన బొండు అంజయ్య, గంబిరావుపేట మండలం నర్మల గ్రామానికి చెందిన ఓరగంటి రాములు ముగ్గురిపై కేసులు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో నకిలీ గల్ఫ్ ఎజెంట్లు విజిట్ వీసాలపై జిల్లాలో ఉన్న నిరుద్యోగులని టార్గెట్ చేసి అధిక మొత్తంలో డబ్బులు తీసుకొని మాయ మాటలు చెప్పి గల్ఫ్ దేశాలకి పంపిస్తున్నారన్నారు. అప్పులు చేసి వెళ్లిన తరువాత కంపనీ వీసా కాదని తెలిసి దేశం కానీ దేశంలో ఎం చేయాలో తెలియక అష్ట కష్టాలు పడుతున్నారన్నారు. నకిలీ ఏజెన్సీలు, ఏజెంట్ల చేతిలో మోసపోయిన వారు నేరుగా పోలిసులకు ఫిర్యాదు చేస్తే, విచారణ జరిపి నేరం రుజువు అయితే కేసు నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు. జిల్లాలో గత సంవత్సరం 43 కేసులు కాగా ఈ సంవత్సరం 19 కేసులు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. విదేశాల్లో ఉద్యోగ, ఉపాధి కోసం వెళ్లేవారు నకిలీ ఏజెంట్లను ఆశ్రయించి మోసపోవద్దని, లైసెన్స్ కలిగి ఉన్న ఏజెంట్లను మాత్రమే ఆశ్రయించాలని సూచించారు. లైసెన్స్ గల ఏజెంట్ల వివరాలు తెలుసుకోవడానికి పోలీస్ శాఖను సంప్రదించవచ్చని ఈ సందర్భంగా ఎస్పీ సూచించారు.

Similar News