కేంద్రంలో మోడీ ప్రభుత్వం చేసిన నిరంకుశ అవినీతిని ప్రజలు ప్రశ్నించండి : ప్రొఫెసర్ హరగోపాల్

గత పదేళ్లుగా కేంద్రంలో మోడీ ప్రభుత్వం సాగించిన ఫాసిస్టు పాలనను, ఆర్థిక విధానాలను, అవినీతిని లోక్ సభ ఎన్నికల సందర్భంగా ప్రజలు ప్రశ్నించాలని, మే 13 న జరగనున్న ఎన్నికల్లో తగిన బుద్ధి

Update: 2024-05-02 10:31 GMT

 దిశ, హిమాయత్ నగర్ : గత పదేళ్లుగా కేంద్రంలో మోడీ ప్రభుత్వం సాగించిన ఫాసిస్టు పాలనను, ఆర్థిక విధానాలను, అవినీతిని లోక్ సభ ఎన్నికల సందర్భంగా ప్రజలు ప్రశ్నించాలని, మే 13 న జరగనున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెప్పాలని, తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కన్వీనర్ ప్రొఫెసర్ హరగోపాల్ తెలంగాణ రాష్ట్ర ప్రజలకు పిలుపునిచ్చారు. తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో మే 2 నుంచి మే 11 వరకు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించనున్న 10 రోజుల ప్రచార కార్యక్రమాన్ని గురువారం ఆయన బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో ప్రారంభించి మాట్లాడుతూ..ప్రజల నిజమైన ఆకాంక్షలను ఎన్నికలలో ప్రచారంలోకి తీసుకరాకుండా బీజేపీ నాయకులు, ముఖ్యంగా దేశ ప్రధాని మోడీ ముస్లింలు, మంగళ సూత్రాలు లాంటి అంశాలను ప్రస్తావిస్తూ చర్చను పక్కదారి పట్టిస్తున్నారని ఆయన విమర్శించారు.

గత పదేళ్ళలో ఆర్థిక వ్యవస్థ పూర్తిగా దివాళా తీసిందని, నిరుద్యోగం, ధరలు విపరీతంగా పెరిగిపోయాయని ప్రజలు నిత్య జీవిత సమస్యలతో పోరాడుతున్నారని, కానీ వీటిని పట్టించుకోకుండా, మతం, దేవుడు, ముస్లింప్రజలపై విద్వేషం పునాదిగా మోడీ ప్రచారం సాగిస్తున్నారని దీనిని తెలంగాణ ప్రజలు తిప్పికొట్టాలని ఆయన అన్నారు. సమావేశంలో ప్రొఫెసర్ రమా మేల్కొటె మాట్లాడుతూ బెంగళూరులో బీజేపీ భాగస్వామ్య పార్టీ నాయకుడు ఎంపీ స్త్రీలపై జరిపిన అత్యాచారాలు జుగుప్సాకరంగా ఉన్నాయని, అటువంటి వ్యక్తికి మోడీ ప్రచారం చేశాడని విమర్శించారు.

తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం మాట్లాడుతూ దేశంలో ఆర్థిక వ్యత్యాసాలు బాగా పెరిగిపోయాయని.. ఈ సమయంలో బీజేపీని కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రాకుండా, ప్రజలు చిత్తుగా ఓడించాలని ఆయన పిలుపు నిచ్చారు. సమావేశంలో భారత్ జోడో అభియాన్ జాతీయ నాయకులు కవిత కురుగంటి మాట్లాడుతూ… దేశమంతా ముఖ్యంగా ఉత్తర బారత దేశంలో బీజేపీ వ్యతిరేక గాలులు వీస్తున్నాయని, అందుకే మోడీ మత విధ్వేషాలు రెచ్చగొట్టడానికి పూనుకుంటున్నాడని అన్నారు. దక్షిణాదిలో కూడా బీజేపీకి స్థానం లేకుండా చేయాలని ఆమె కోరారు. ఈ సమావేశంలో ప్రముఖ విద్యావేత్తలు డాక్టర్ వనమాల, ప్రొఫెసర్ సుకుమార్ , అనిశెట్టి శంకర్, మహిళా రైతుల హక్కుల వేదిక నాయకులు డాక్టర్ రుక్మిణీ రావు, విరసం నాయకులు రాము, టీపీజేఏసీ కో కన్వీనర్ లు బన్నూరు జ్యోతి, కన్నెగంటి రవి, విస్సా కిరణ్ కుమార్, కరుణాకర్ దేశాయి, నగర నాయకులు ముత్తయ్య , రామగిరి ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు.

Similar News