High Court: కోదాడ కిట్స్ ఇంజనీరింగ్ కళాశాలకు హైకోర్టు షాక్

కోదాడలోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల నిర్వాహకులు ఫోర్జరీ పత్రాలతో అనుమతులు పొందారని..

Update: 2024-04-27 08:32 GMT

దిశ, కోదాడ: కోదాడలోని కిట్స్ మహిళా ఇంజనీరింగ్ కళాశాల నిర్వాహకులు ఫోర్జరీ పత్రాలతో అనుమతులు పొందారని, దీనిపై తాను ఢిల్లీలోని ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, హైదరాబాద్‌లోని జెఎన్‌టియుకి ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోవడం లేదని కోదాడకు చెందిన ఉస్మానియా యూనివిర్సిటీ జెఏసి నాయకుడు డాక్టర్ భట్టు శ్రీహరి రాష్ట్ర హైకోర్టులో దాఖలు చేసిన రిట్ పిటీషన్ 8843/24 పై హైకోర్టు తీవ్రంగా స్పందించింది.

ఫిర్యాదు దారుడు చేసిన ఆరోపణలపై ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్, హైదరాబాద్‌లోని జెఎన్‌టియు, నిపుణుల కమిటీలను ఏర్పాటు చేసి నాలుగు వారాలలోగా తగు చర్యలు తీసుకోవాలని, అంత వరకు కళాశాలకు ఎటువంటి అనుమతులను పొడగించవద్దని కోర్టు తన ఆదేశాలలో పేర్కొంది. దీనికి సంబంధించిన వివరాలు ఈ విధంగా ఉన్నాయి.

కోదాడలోని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల ఇతరుల భూమిని తనదిగా చూపడంతోపాటు, ఆర్డీఓ సంతకాన్ని ఫోర్జరీ చేసి నాలా కన్వర్షన్ సర్టిఫికెట్ పొందినదని దీనిపై చర్యలు తీసుకోవాలని ఓయూ జేఏసి నేత జెఎన్‌టియుకి ఫిర్యాదు చేసాడు . దీనిపై యూనివర్సిటీ నిపుణుల కమిటీ ఏర్పాటు చేయడంతో వారు లెటర్ నెంబర్  డిఏఎఫ్ఏ / కిట్స్ - డబ్ల్యుసీ / క్యూయు / కంప్లైంట్/ 2023 తేదీ 04-09-23న నివేదిక ఇచ్చారు.

ఈ నివేదికలో కళాశాల యాజమాన్యం తమదని చెపుతున్న డాక్యుమెంట్ నెంబర్ 9307 / 2007కు సంబంధించి యాజమాన్యపు హక్కుల పత్రాలతోపాటు, దీనికి ఆర్డీఓ ఇచ్చిన నాలా సర్టిఫికెట్లను సమర్పించడంలో విఫలమైందని పేర్కొన్నారు. సమాచార హక్కు చట్టం ద్వారా దీనిని సేకరించిన భట్టు శ్రీహరి దీనిపై చర్యలు తీసుకోవాలని ఏఐసీటియు, జేఎన్‌టియులకు 17-02-24న ఫిర్యాదు చేశాడు.

వారు స్పందించకపోవడంతో 18-03-2024న మరోసారి ఫిర్యాదు చేశాడు. అయినప్పటికీ కనీస చర్యలు తీసుకోకపోవడంతో భట్టు శ్రీహరి రాష్ట్ర హైకోర్టులో రిట్ పిటిషన్ నెంబర్ 8843/2024 దాఖలు చేశాడు . దీనిపై వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సీవి భాస్కర్ రెడ్డి ఈ నెల 23న పై ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటికైనా ఏఐసిటియు, జెఎన్‌టియులు తగు చర్యలు తీసుకోవాలని, అక్రమాలకూ పాల్పడిన కోదాడలోని కిట్స్ ఇంజనీరింగ్ కళాశాల యాజమాన్యంపై తగు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Similar News