రాజస్థాన్‌లో 24 అంతస్తుల ఆసుపత్రి తెల్వదా? మంత్రి కోమటిరెడ్డిపై హరీశ్ రావు ఫైర్

బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషం చిమ్మడం బాధాకరమని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు.

Update: 2024-05-24 07:01 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన టిమ్స్ ఆసుపత్రుల నిర్మాణాలపై మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి విషం చిమ్మడం బాధాకరమని మాజీ మంత్రి హరీశ్ రావు విమర్శించారు. ఈ మేరకు ఆయన ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. జనాభా అవసరాలకు అనుగుణంగా, అత్యాధునిక, నాణ్యమైన వైద్యాన్ని అందించేందుకు హైదరాబాద్ నలువైపులా టిమ్స్ ఆసుపత్రులు ఏర్పాటు చేయాలని నాటి ప్రభుత్వం నిర్ణయించింది. ఆ దిశగా వేగంగా అడుగులు వేసిందన్నారు. 5 నెలలుగా ఆ నిర్మాణాలను, పనుల పర్యవేక్షణను గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వం, లేనిపోని ఆరోపణలు చేస్తున్నదని పేర్కొన్నారు. ఆస్పత్రులపై రాజకీయాలు చేస్తోందని ఆరోపించారు.

టిమ్స్ ఆసుపత్రుల పట్ల కనీస అవగాహన కూడా లేకుండా ఆర్‌అండ్‌బీ శాఖ మంత్రి మాట్లాడటం దురదృష్టకరం అని విమర్శించారు. టిమ్స్ ఎల్బీనగర్ ఆసుపత్రి నిర్మాణం జి+14 అంతస్తులు మాత్రమే అయితే 27 అంతస్తులు అని మాట్లాడటం మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు.

ఎక్కువ అంతస్తులు ఉంటే పేషెంట్లు ఇబ్బంది పడతారని ముసలి కన్నీరు కార్చుతున్న మంత్రికి, ఏప్రిల్ 5, 2022 న జైపూర్ లో నాటి రాజస్థాన్ కాంగ్రెస్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లాట్ గారు నిర్మిస్తున్న 24 అంతస్తుల ఆసుపత్రి ఎందుకు కనిపించడం లేదు.? అని ప్రశ్నించారు. ఇండియా కూటమిలో భాగస్వామిగా ఉన్న సీఎం కేజ్రీవాల్ డిల్లీలో నిర్మిస్తున్న 22 అంతస్తుల ఆసుపత్రి ఎందుకు కనిపించడం లేదు.? అని నిలదీశారు.

నిజంగా పేద ప్రజలకు మంచి చేయాలనే ఆలోచన ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉంటే, త్వరితగతిన టిమ్స్ ఆసుపత్రి నిర్మాణాలను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని డిమాండ్ చేశారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా వైద్య సదుపాయాలు పెంచాలని, అంతేగాని చవకబారు వ్యాఖ్యలు చేసి స్థాయిని మరింత తగ్గించుకోవద్దని పేర్కొన్నారు.

Tags:    

Similar News