రైల్వే ప్రయాణికులకు గుడ్ న్యూస్.. రిజర్వేషన్లపై కీలక నిర్ణయం
సాధారణంగా రైలు ప్రయాణికులు దూర ప్రాంతాలకు, ఇతర ప్రదేశాలకు వెళ్లాలంటే కనీసం వారం, 15 రోజులు లేదా నెల ముందు టికెట్ రిజర్వేషన్ చేసుకోవడం.. తమ టికెట్ ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుందా? అని వేచిచూడటం సర్వసాధారణం.
దిశ, తెలంగాణ బ్యూరో: సాధారణంగా రైలు ప్రయాణికులు దూర ప్రాంతాలకు, ఇతర ప్రదేశాలకు వెళ్లాలంటే కనీసం వారం, 15 రోజులు లేదా నెల ముందు టికెట్ రిజర్వేషన్ చేసుకోవడం.. తమ టికెట్ ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుందా? అని వేచిచూడటం సర్వసాధారణం. కానీ ఇప్పుడు ఆ పరిస్థితికి భిన్నంగా రైలు ఎక్కడానికి ముందు రిజర్వేషన్ చేసుకుంటే చాలు. ఇక మీరు ఆ రైలులో ప్రయాణించవచ్చు. ఇలాంటి అవకాశాన్ని రైలు ప్రయాణికులకు ఐఆర్సీటీసీ ప్రవేశపెట్టింది. అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
యాప్, సైట్ ద్వారా బుకింగ్
ట్రైన్ జర్నీ చేసే ప్రయాణికులు, యాత్రికులు చివరి నిమిషం వరకు ట్రైన్ టికెట్లు బుక్ చేసుకోసుకోవడం కోసం ముందుగా అందులో సీట్లు ఖాళీ ఉన్నాయా? లేదా అనేది తెలుసుకోవాలి. రైల్వే శాఖ ప్రిపేర్ చేసే ఆన్లైన్ చార్ట్ ద్వారా ఈ విషయం తెలుసుకోవచ్చు. దీని కోసం ముందుగా ఐఆర్సీటీసీ యాప్ ఓపెన్ చేసి ట్రైన్ సింబల్పై క్లిక్ చేస్తే.. చార్ట్ వెకెన్సీ కనిపిస్తుంది. అలాగే నేరుగా ఆన్లైన్ చార్ట్స్ వెబ్సైట్లోకి వెళ్లి చెక్ చేయొచ్చు. అక్కడ ట్రైన్ పేరు, నంబర్, తేదీ, ఎక్కాల్సిన స్టేషన్ వివరాలు ఎంటర్ చేసి గెట్ ట్రైన్ చార్ట్పై క్లిక్ చేయాలి. వెంటనే తరగతుల వారీగా (ఫస్ట్ ఏసీ, సెకండ్ ఏసీ, థర్డ్ ఏసీ, చైర్ కార్, స్లీపర్) అందుబాటులో ఉన్న ఖాళీ సీట్ల వివరాలు కనిపిస్తాయి. సీటు ఉంటే టికెట్ బుక్ చేసుకోవచ్చు. ఒకవేళ సీట్లు లేకపోతే సున్నా అని చూపిస్తుంది. కోచ్ నంబర్, బెర్త్ ఇతర మొత్తం వివరాలు అక్కడే కనిపిస్తాయి. ట్రైన్ ప్రారంభం అయ్యే స్టేషన్లలో ఎక్కేవారికే ఈ ఆప్షన్ ఎంతో ప్రయోజనకరంగా ఉంటుంది.
లాస్ట్ మినట్లో క్యాన్సిల్ అయ్యే టికెట్లు.. విక్రయం
పలు కారణాలతో ప్రయాణం రోజునే టికెట్ క్యాన్సిల్ చేసుకొనే ప్యాసింజర్స్ చాలా మంది ఉంటారు. అలాంటి సందర్భంలో ఖాళీగా ఉన్న టికెట్లను విక్రయించేందుకు రైల్వే శాఖ ఈ సదుపాయాన్ని తీసుకొచ్చింది. ప్రతి ట్రైన్ టికెట్ బుకింగ్ కన్ఫర్మేషన్ కోసం రైల్వే శాఖ రెండు చార్ట్లను ప్రిపేర్ చేస్తుంది. ఫస్ట్ చార్ట్ రైలు బయల్దేరడానికి నాలుగు గంటల ముందు ప్రిపేర్ అవుతుంది. ఇక రెండో చార్ట్ రైలు బయలు దేరే సమయానికి ముందు తయారు చేస్తారు. గతంలో అరగంట ముందు వరకు మాత్రమే టికెట్ బుకింగ్కు అనుమతించేవారు. ఇప్పుడు రైలు బయల్దేరడానికి ఐదు నిమిషాల ముందు వరకు ఆ వెసులుబాటు కల్పించారు. కాబట్టి ట్రైన్ స్టార్ట్ అయ్యే ఐదు నిమిషాల ముందు కూడా టికెట్లు అందుబాటులో ఉంటే ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో బుక్ చేసుకోవచ్చు.