సీఎం రేవంత్, బండి సంజయ్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్: కేటీఆర్
బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్
దిశ, వెబ్డెస్క్: బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, కరీంనగర్ పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి బండి సంజయ్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్ సవాల్ విసిరారు. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో వేములవాడలో ఆదివారం బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి హాజరైన కేటీఆర్ మాట్లాడుతూ.. ఎంపీగా ఉన్న ఐదేళ్లలో బండి సంజయ్ కరీంనగర్కు ఏం చేశారో చర్చకు సిద్ధమా అని ఛాలెంజ్ చేశారు. లోక్ సభ ఎన్నికల్లో కరీంనగర్లో బీజేపీ, బీఆర్ఎస్ మధ్యే పోటీ అని కేటీఆర్ తేల్చి చెప్పారు.
సీఎం రేవంత్ రెడ్డి, బండి సంజయ్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందని.. అందులో భాగంగానే కరీంనగర్లో కాంగ్రెస్ డమ్మీ క్యాండిడేట్ను నిలబెట్టిందని ఆరోపించారు. పార్టీ కండువా లేకుంటే కాంగ్రెస్ అభ్యర్థిని ఆ పార్టీ కార్యకర్తలే గుర్తించలేరని ఎద్దేవా చేశారు. పార్లమెంట్ ఎన్నికల్లో 10-12 స్థానాల్లో బీఆర్ఎస్ను గెలిపిస్తే.. రాష్ట్ర రాజకీయాలను కేసీఆర్ శాసించే రోజు ఏడాదిలో వస్తుందని కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోక్ సభ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు మాయమవుతాయని అన్నారు.