రూ.2203 ధర ఇప్పిస్తా.. రైతులు అధైర్య పడకండి: హరీష్ రావు

తెలంగాణ వ్యాప్తంగా వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు.

Update: 2024-04-21 10:56 GMT

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ చేశారు. ఆదివారం సిద్దిపేటలో హరీష్ రావు పర్యటించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు ఆయనతో సమస్యలు చెప్పుకున్నారు. అనంతరం జిల్లా వ్యవసాయ అధికారులతో హరీష్ రావు ఫోన్‌లో మాట్లాడారు. రైతులు ఎవరూ తొందరపడి తక్కువ ధరకు ధాన్యం విక్రయించొద్దని సూచించారు. రూ.2203 ధర ఇప్పించే బాధ్యత తనది అని భరోసా ఇచ్చారు.

ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా ధాన్యం తడిసిపోయింది. ఆ ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదన్నారు. పదేళ్ల బీఆర్ఎస్ హయాంలో ఎనాడూ ఇలాంటి కష్టాలు రాలేదని తెలిపారు. కాంగ్రెస్‌ వచ్చాక కరెంట్ లేక పంటలు ఎండుతున్నాయి.. మోటార్లు కాలిపోతున్నాయి.. రైతుబంధు లేదు అని తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. పదేళ్లు రైతులను కేసీఆర్ కంటికిరెప్పలా కాపాడుకున్నారని అన్నారు. ఈ ప్రభుత్వానికి పార్లమెంట్ ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఓటర్లకు, రైతులకు సూచించారు.

Tags:    

Similar News