అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన హన్మకొండ జిల్లాలో శుక్రవారం చోటుచేసుకుంది.

Update: 2023-02-10 08:28 GMT

దిశ, భీమదేవరపల్లి: అప్పుల బాధ తాళలేక రైతు ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తపల్లి గ్రామంలో శుక్రవారం చోటుచేసుకుంది. మృతుని కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు... పెంట కుమారస్వామి (36) ములుకనూరు సహకార సంఘంలో డ్రైవర్‌గా పనిచేస్తూ వ్యవసాయం చేసుకుంటున్నాడు. గ్రామంలో తనకున్న రెండు ఎకరాల భూమిలో పత్తి, వరి పంట సాగు చేస్తున్నాడు. ఇటీవల తన వ్యవసాయ క్షేత్రంలో వేసిన రెండు బోర్‌లలో నీరు పడకపోవడంతో రూ.3 లక్షల వరకు అప్పు చేశాడు.

వేసిన పంటల ద్వారా తగిన ఆదాయం రాకపోవడం, చేసిన అప్పు ఎలా తీర్చాలో తెలియక తీవ్ర ఒత్తిడితో మనస్థాపానికి గురయ్యాడు. గురువారం రాత్రి తన వ్యవసాయ క్షేత్రం వద్దకు వెళ్లి క్రిమిసంహారక మందు సేవించి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎంతకు ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు బావి వద్దకు వెళ్లి చూస్తే అపస్మారక స్థితిలో కనిపించాడు. వెంటనే స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని హుజురాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. జరిగిన ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Tags:    

Similar News