కాంగ్రెస్ సర్కార్ ‘సన్న బియ్యం’ కుంభకోణం! మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు

సన్నబియ్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణానికి పాల్పడుతోందని మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు.

Update: 2024-05-26 06:40 GMT

దిశ, డైనమిక్ బ్యూరో: సన్నబియ్యం కొనుగోళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం కుంభకోణానికి పాల్పడుతోందని మాజీ మంత్రి కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. పౌరసరఫరాల శాఖలో 35 లక్షల టన్నుల ధాన్యం సేకరణ కోసం పిలిచిన గ్లోబల్ టెండర్లు మొదటి కుంభకోణమని ఆరోపించారు. రెండోది మధ్యాహ్న భోజన పథకం కోసం 2 లక్షల 20 వేల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం కొనుగోళ్ళ పేరిట మరో కుంభకోణం జరిగిందని కేటీఆర్ ఆరోపించారు. ఈ రెండు కలిపితే రూ. 11,00 కోట్ల కుంభకోణానికి కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని కేటీఆర్ ఆరోపించారు. అధికారంలోకి వచ్చి 50 రోజులు కాకముందే ఈ దోపిడికి కాంగ్రెస్ ప్రభుత్వం తెరలేపిందని విమర్శించారు.

ఈ ప్రభుత్వంతో ఏ పని కాదన్నారు. మహిళలకు రూ. 2500 ఇవ్వడానికి టైమ్ లేదన్నారు. ఆసరా పెన్షన్లు కనబడవు, రూ. 2 లక్షల రుణమాఫీ చేసే తెలివి లేదు. కానీ గ్లోబల్ టెండర్ల కోసం మాత్రం జనవరి 25 రోజు కమిటీ, అదే రోజు గైడ్ లైన్స్ ఇవ్వడం, అదేవిధంగా ఆ రోజే టెండర్లను పిలవడం కూడా జరిగిందని తేల్చిచెప్పారు.

రాష్ట్రంలో ఉండే రైస్ మిల్లర్లు 2,100 ధాన్యం కోనుగోళ్ళు చేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వానికి తెలిపారని చెప్పారు. రైస్ మిల్లర్లు ప్రభుత్వానికి ఆఫర్ ఇస్తే దాన్ని రిజెక్ట్ చేసి.. వారి మాట వినకుండా గ్లోబల్ టెండర్ల పేరిట కొన్ని నిబంధనలు పెట్టి మిల్లర్లను పక్కన పెట్టారన్నారు. గతంలో కేంద్రియ బండార్ అనే సంస్థను బ్లాక్ లిస్ట్ చేశామని తెలిపారు. ఈ ప్రభుత్వం బ్లాక్ లిస్ట్‌లో ఉన్న సంస్థను రూల్స్ బ్రేక్ చేసి తొలగించి నాలుగు కంపెనీలతో కుమ్మకు అయ్యారని వెల్లడించారు. ఈ నాలుగు సంస్థలు మనిలాండరీంగ్‌కు పాల్పడుతు 4 వేల మంది మిల్లర్లను బెదిరిస్తున్నారని ఆరోపించారు.

ఈ స్కాంలో హైదరాబాద్ నుంచి ఢిల్లీ పెద్దలు దాకా అనేకమంది హస్తం ఉందన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో పెద్ద ఎత్తున మనీలాండరింగ్ జరిగిన కేంద్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదని తెలిపారు. దీనిపై కేంద్ర ప్రభుత్వ ఆధీనంలోని ఎఫ్సీఐ సంస్థ ఎందుకు స్పందించడం లేదు.. ఎఫ్సీఐ కేంద్ర ప్రభుత్వ విచారణ సంస్థల (ఈడీ, సీబీఐ, విజిలెన్స్) విచారణ కోసం ఆదేశించాలని కోరాలి అని తెలిపారు. లేకుంటే ఈ మొత్తం కుంభకోణంలో బీజేపీకి కూడా పాత్ర ఉందని భావించాల్సి వస్తుందన్నారు.

గతంలో అన్ని అనవసరమైన విషయాలపైన అడ్డగోలుగా నోరు పారేసుకున్న రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే.. ఈ రెండు టెండర్ల వ్యవహారంలో సిట్టింగ్ జడ్జ్ విచారణ చేయించాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంలో కేంద్రం, ఎఫ్సీఐ, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే ఈ వ్యవహారాన్ని వదిలిపెట్టమని, న్యాయపరంగా కేసులు వేసి దోషులను ప్రజల ముందు నిలబెడతామన్నారు. తప్పకుండా ఆధారాలతో సహా వీళ్ళందరిని కోర్టులతోపాటు ప్రజా కోర్టులోను ఎండగడతామన్నారు.

Tags:    

Similar News